న్యూఢిల్లీ: అరేబియా సముద్రంలో హైజాక్ అయిన ఇరాన్ చేపల బోటును, అందులో ఉన్న సిబ్బందిని ఇండియన్ నేవీ (Indian Navy) రక్షించింది. సుమారు 12 గంటలపాటు సాగిన ఈ ఆపరేషన్లో పాకిస్థాన్కు (Pakistan) చెందిన 23 మంది సిబ్బందిని రక్షించినట్లు అధికారులు వెల్లడించారు. సముద్రాల్లో యాంటీ పైరసీలో భాగంగా ఈ ప్రత్యేక ఆపరేషన్ చేపట్టినట్లు తెలిపారు. గల్ఫ్ ఏడెన్కు సమీపంలో ఉన్న సోకోట్రా ద్వీపసమూహానికి 90 నాటికల్ మైళ్ల దూరంలో ఇరాన్కు చెందిన చేపల బోటు (Al Kambar) గురువారం హైజాక్కు గురైందని, తొమ్మిది మంది సముద్ర పైరేట్స్ పడవను తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు సమాచారం అందిందని శుక్రవారం రాత్రి భారత నేవీ ప్రకటించింది. ఆ బోటును, సిబ్బందిని రక్షించేందుకు ప్రత్యేక ఆపరేషన్ చేపడుతున్నట్లు వెల్లడించింది.
దీంతో తొలుత ఐఎన్ఎస్ సుమేధా (INS Sumedha) సముద్రపు దొంగల అదుపులో ఉన్న ‘ఏఐ కంబార్’ బోటును అడ్డగించిందని, ఆ తర్వాత ఐఎన్ఎస్ త్రిశూల్ (INS Trishul) నౌక దానికి తోడైందని అధికారులు చెప్పారు. దాదాపు 12 గంటల ప్రత్యేక ఆపరేషన్ అనంతరం బోటులో ఉన్న పైరేట్లు లొంగిపోయారని తెలిపారు. 23 మంది పాకిస్థాన్ జాతీయులు సురక్షితంగా బయటపడ్డట్లు పేర్కొన్నారు.