Indian Flag evolution | భారత రాజ్యాంగ సభ 1947 జూలై 22న స్వరాజ్ పతాకాన్నే భారత జాతీయ పతాకంగా స్వీకరించింది. అయితే చిన్నమార్పు చేసింది. మధ్యలో తెలుపు రంగులో చరఖా స్థానంలో అశోకుడి ధర్మచక్రాన్ని గ్రహించారు. జెండా పరిణామ క్రమం ఇదీ…
మొదటి జెండా
1906 ఆగస్టు 7న కలకత్తా నగరం పార్సీ బగాన్లో ఎగరవేశారు. ఈ పతాకంలో పైనుంచి కిందికి ఆకుపచ్చ, పసుపుపచ్చ, ఎరుపు పట్టీలు ఉండేవి. ఆకుపచ్చ పట్టీలో 8 రాష్ర్టాలకు గుర్తుగా 8 కమలం పూలు, పసుపుపచ్చ పట్టీలో ‘బందేమాతరం’ అని ఉండేవి. ఎరుపురంగు పట్టీలో ఎడమ వైపు చంద్రుడు, కుడివైపు సూర్యుడిని ఉంచారు.
భికాజీ కామా పతాకం
1907లో మొదటి దానికి కొంచెం మార్పులు చేసి భికాజీ కామా రెండో జెండా రూపొందించాడు. దీనిని అదే సంవత్సరం పారిస్లో భారతీయ విప్లవకారుల మధ్య ఎగరవేశారు. పై పట్టీలో ఎనిమిదికి బదులుగా ఏడు కమలం పూలు, ఎరుపు స్థానంలో కాషాయాన్ని ఉపయోగించారు. పైనుంచి కిందికి కాషాయం, పసుపుపచ్చ, ఆకుపచ్చ రంగులు వరసగా ఉంటాయి.
హోంరూల్ పతాకం
హోం రూల్ ఉద్యమంలో భాగంగా అనీబిసెంట్, లోకమాన్య తిలక్ కొత్తజెండా రూపొందించారు. ఇందులో ఒక రంగు తర్వాత మరో రంగు వచ్చే ఐదు ఎరుపు, నాలుగు ఆకుపచ్చ పట్టీలను కలిగి ఉన్నాయి. వీటిపై సప్తరుషులకు గుర్తుగా ఏడు నక్షత్రాలు ఉండేవి. పైభాగంలో ఒక మూలన చంద్రరేఖ, మరో మూలన యూనియన్ జాక్ (బ్రిటిష్ ఇండియా పతాకం) ఉండేవి.
గాంధీజీ త్రివర్ణ పతాకం
1921లో మధ్యలో చరఖా గుర్తుతో త్రివర్ణ పతాకాన్ని గాంధీజీ ప్రతిపాదించాడు. ఇందులో వర్ణాలు ప్రధాన మతాలకు ప్రతీకలుగా ఉండాలనుకున్నాడు. తర్వాత రంగులు లౌకికవాదం ప్రతిబింబించేలా ఉండాలని భావించాడు. ఈ పతాకంలో దిగువన ఉన్న ఎరుపు త్యాగాన్ని, మధ్యలో ఉన్న ఆకుపచ్చ ఆశను, పైన ఉన్న తెలుపు శాంతికి ప్రతీకలు.
పింగళి వెంకయ్య పతాకం
ప్రస్తుత పతాకానికి చాలా దగ్గరగా ఉన్నది 1923లో ఉనికిలోకి వచ్చింది. దానిని తెలుగువాడైన పింగళి వెంకయ్య రూపొందించాడు. ఇందులో కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగులు ఉన్నాయి. తెలుపు భాగంలో చరఖా ఉండేది. దీనిని 1923 ఏప్రిల్ 13న నాగపూర్లో ఎగరవేశారు. దీనికి స్వరాజ్ పతాకం అని పేరుపెట్టారు.