Indian military | న్యూఢిల్లీ: ఇండియన్ మిలిటరీలో 11,266 మంది యువ అధికారుల కొరత ఉన్నదని కేంద్ర ప్రభుత్వం స్వయంగా పార్లమెంట్లో వెల్లడించింది. మేజర్, కెప్టెన్ ర్యాంకు స్థాయిలో అత్యధిక పోస్టులు ఖాళీగా ఉన్నట్టు తెలిపింది. అధికారుల కొరతను అధిగమించేందుకు షార్ట్ సర్వీస్ కమిషన్ను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దనున్నట్టు పేర్కొన్నది. సగానికిపైగా ఖాళీలు సైన్యంలోనే ఉన్నట్టు వెల్లడించింది. మేజర్ స్థాయి అధికారులు 2,094 మంది అవసరం ఉన్నదని, కెప్టెన్ ర్యాంకు స్థాయిలో 4,734 మంది అధికారులు అవసరమని వివరించింది.
వైమానిక దళంలో 881 మంది స్క్వాడ్రన్ లీడర్స్, 940 మంది ఫ్లైట్ లెప్టినెంట్స్ అవసరమని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఇక నావికాదళంలో లెఫ్టినెంట్ కమాండర్, అంతకంటే దిగువ స్థాయి అధికారులు 2,617 మంది అవసరమని వెల్లడించింది. అయితే ప్రస్తుత అవసరాలకు ఇప్పుడున్న అధికారులు సరిపోతారని పేర్కొన్నది. కొరతను అధిగమించేందుకు మాజీ అధికారులను తిరిగి నియమించుకునే ప్రతిపాదన ఏమీ లేదని తెలిపింది.