షిమ్లా: హిమాచల్ ప్రదేశ్లోని షిమ్లా(Shimla)లో ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీ(IIAS) సెంటర్ కుంచించుకుపోతున్నది. ఆ ఇన్స్టిట్యూట్ బిల్డింగ్ ఉన్న ప్రాంతం వద్ద.. భారీగా కొండచరియలు విరిగాయి. బిల్డింగ్ చుట్టు ఉన్న లాన్ పరిసరాల్లోనే.. రెండు రోజుల క్రితం కొండచరియలు విరిగిపడ్డాయి. అక్కడ ఉన్న మట్టి కిందకు జారిపోవడం వల్లే.. సమ్మర్ హిల్ ప్రాంతంలో ఉన్న శివాలయం శిధిలమైంది. ఆ ఆలయంలో సుమారు 20 మంది వరకు సజీవ సమాధి అయిన విషయం తెలిసిందే.
ఐఐఏఎస్ ఇన్స్టిట్యూట్ బయట ఉన్న లాన్ చివరే కొండచరియలు విరిగిపడ్డాయి. ఆ ఇన్స్టిట్యూట్కు ఉన్న ఫెన్సింగ్ కూడా ఆ మట్టిచరియల్లో కొట్టుకుపోయింది. దీంతో పాటు ఆ పచ్చిక మైదానంలో ఉన్న చాలా వరకు దేవదర్ వృక్షాలు కూడా నేలమట్టం అయ్యాయి. ఈ నేపథ్యంలో ఐఐఏఎస్ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. ఇన్స్టిట్యూట్ భద్రత కోసం రక్షణ చర్యలు తీసుకోవాలని కోరింది. స్టేట్ డిజాస్టర్ అథారిటీతో పాటు వాతావరణ శాఖ అధికారులు ఆ స్పాట్ను విజిట్ చేశారు.
వాస్తవానికి ఐఐఏఎస్ వద్ద కొండచరియలు విరిగిపడిన లాన్ దిశలో ప్లాసిక్ షీట్లను అమర్చారు. కానీ కొండచరియల తీవ్రతకు కింద ఉన్న రోడ్లు, రైల్వే ట్రాక్ కొట్టుకుపోయాయి. శివాలయం కూడా ఆ మట్టిలోనే ధ్వంసమైంది. ఐఐఏఎస్ నుంచి దాదాపు 800 మీటర్ల కిందకు కొండచరియలు కొట్టుకుపోయాయి. ఇక ఐఐఏఎస్ పరిసరాల్లో ఉన్న ఓ రోడ్డు కూడా కృంగిపోతున్నట్లు అధికారులు చెప్పారు. అయితే ఆ కృంగుతున్న దిశగా వర్షపు నీరు వెళ్లకుండా చేస్తున్నామని అధికార వర్గాలు తెలిపాయి.
క్లౌడ్ బస్ట్ వల్లే కొండచరియలు విరిగిపడినట్లు భావిస్తున్నా.. వెదర్ శాఖ మాత్రం దానికి భిన్నంగా అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తోంది. క్లౌడ్ బస్ట్ అయ్యేంత రేంజ్లో వర్షం పడలేదని, కొండపై మట్టి చాలా విశాల విస్తీర్ణంలో కొట్టుకుపోందన్నారు. కొండచరియలు విరిగిపడ్డ సమ్మర్ హిల్ ప్రాంతంలో ఇవాళ ఉదయం కూడా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. శిథిలాలను తొలగిస్తున్నారు.