ఇస్లామాబాద్ : గురుపురబ్ వేడుకల్లో పాల్గొనేందుకు సిక్కు యాత్రికులతో కూడిన బృందాలు పొరుగు దేశం సందర్శించే క్రమంలో వారి భద్రత కోసం పాకిస్తాన్లో భారత రాయబార కార్యాలయం చర్యలు చేపడుతోంది. స్ధానిక అధికారులతో సమన్వయం ద్వారా సిక్కు యాత్రికుల భద్రతకు ముమ్మర ఏర్పాట్లు చేపట్టింది.
పాకిస్తాన్లోని పలు గురుద్వారాలను యాత్రికులు సందర్శించేలా వారికి అవసరమైన ఏర్పాట్లు, రవాణా సౌకర్యం, భద్రతా ఏర్పాట్లపై క్షేత్రస్ధాయి పరిస్ధితిని ఇస్లామాబాద్లోని భారత రాయబార కార్యాలయ బృందం పరిశీలించింది. పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్లో నంకన సాహిబ్ను సందర్శించేందుకు ఆదివారం దాదాపు 2418 మంది సిక్కు యాత్రికులు అట్టారి-వాఘా సరిహద్దు దాటారు.
గురునానక్ దేవ్ జన్మస్ధలం నంకనా సాహిబ్ను సందర్శించిన అనంతరం యాత్రికులు నవంబర్ 8న తొలి సిక్కు గురువు జయంతి వేడుకల్లో పాలుపంచుకుంటారు. ఆపై వారు నవంబర్ 10న హసన్ అబ్దల్లో గురుద్వార పంజా సాహిబ్ను సందర్శిచి 11న లాహోర్లోని గురుద్వార దెహ్ర సాహిబ్కు చేరుకుంటారు. నవంబర్ 13న యాత్రికుల బృందం ఇమైనాబాద్లోని గురుద్వారా డెహ్రా సాహిబ్ను, కర్తార్పూర్ సాహిబ్లోని గురుద్వార దర్బార్ సాహిబ్ను సందర్శించి ఆపై లాహోర్లోని డెహ్రా సాహిబ్కు వెనుతిరుగుతారు. ఇక అక్కడినుంచి నవంబర్ 15న సిక్కు యాత్రికులు భారత్ బయలుదేరుతారు.