తూర్పు లద్దాఖ్లోని పాంగాంగ్ సరస్సుపై చైనా నిర్మిస్తున్న వంతెనపై కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ వేదికగా స్పందించింది. చైనా దురాక్రమణ చేసిన స్థలంలోనే ఈ వంతెన నిర్మిస్తోందని భారత ప్రభుత్వం పేర్కొంది. ఇతర దేశాలు భారత దేశ సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను గౌరవించాల్సిందేనని భారత్ తేల్చి చెప్పింది. ‘పాంగాంగ్ సరస్సుపై చైనా నిర్మిస్తున్న వంతెన వ్యవహారం ప్రభుత్వం దృష్టికి వచ్చింది. 1962 లో చైనా అక్రమంగా ఆక్రమించుకున్న స్థలంలోనే చైనా ఈ నిర్మాణం చేపడుతోంది. ఈ అక్రమ నిర్మాణాన్ని భారత ప్రభుత్వం ఎన్నటికీ అంగీకరించదు. భారత సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను ఇతర దేశాలు గౌరవించాల్సిందే’ అని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది.