Sharada Temple | బెంగళూరు, డిసెంబర్ 29: పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లోని ప్రముఖ శారద ఆలయం పరిసరాలను పాకిస్థాన్ సైన్యం ఆక్రమించిందని సేవ్ శారద కమిటీ (ఎస్ఎస్సీ) వ్యవస్థాపకుడు రవీంద్ర పండిత చెప్పారు. ఆ స్థలంలో కాఫీ హోంని కూడా ఏర్పాటు చేసిందని తెలిపారు. శుక్రవారం ఆయన బెంగళూరులో విలేకరులతో మాట్లాడుతూ ఈ ఆక్రమణలను తొలగించడానికి భారత ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కోరారు. ‘వాస్తవానికి ఈ స్థలం విషయంలో ఎస్ఎస్సీకి అనుకూలంగా కోర్టు తీర్పు కూడా ఉన్నది.
కానీ పాక్ సైన్యం మాత్రం స్థలాన్ని ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నది. ఆలయ గోడలను ధ్వంసం చేస్తున్నది. దీన్ని వ్యతిరేకిస్తూ పోరాడుతున్నాం. పీవోకేలోని స్థానిక ప్రజలు కూడా మాకు మద్దతుగా నిలుస్తున్నారు. అయితే మా పోరాటానికి భారత ప్రభుత్వం మద్దతు కోరుతున్నాం. వెంటనే భారత ప్రభుత్వం జోక్యం చేసుకొని ఆలయ పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలి. శారద ఆలయాన్ని అభివృద్ధి చేయాలి. వారసత్వ సంపద గుర్తింపునివ్వాలి’ అని రవీంద్ర కోరారు.