Indian Embasy | ఉక్రెయిన్ రాజధాని కీవ్లో భారత రాయబార కార్యాలయాన్ని మూసివేశారు. కీవ్ నగరంపై రష్యా సైన్యాలు భీకర దాడులు చేస్తున్న నేపథ్యంలో ఆ నగరంలోని భారత రాయబార కార్యాలయం మూసేయాలని విదేశాంగశాఖ నిర్ణయించింది. కీవ్లో ప్రస్తుతం భారతీయులెవరూ లేరు. కీవ్ ఎంబసీలో గల భారత దౌత్య సిబ్బందిని మరోచోటికి తరలించారు. ఈ మేరకు విదేశాంగశాఖ ఓ ప్రకటనలో తెలిపింది.
తమ దేశంపై రష్యా దాడులను ఖండిస్తున్నామని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కై ప్రకటించారు. దేశ చరిత్రలో మంగళవారం బ్లాక్డే అని అభిప్రాయ పడ్డారు. ఈయూ పార్లమెంట్ను ఉద్దేశించి జెలెన్స్కై మాట్లాడుతూ తమకు ఈయూ దేశాల మద్దతు ఉందన్నారు. రష్యా ఎన్ని దాడులు చేసినా తాము పోరాడుతున్నామని, యుద్ధానికి భయపడబోమని స్పష్టం చేశారు. రష్యా దాడిలో అమాయకులు, ప్రజలు మరణిస్తున్నారని జెలెన్స్కై ఆందోళన వ్యక్తం చేశారు.