ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ అడ్డగోలు ఆర్థిక విధానాల కారణంగా తమ పదవులకు రాజీనామా చేస్తున్న ఆర్థిక వేత్తల జాబితాలో మరో పేరు చేరింది. భారత ప్రధాన ఆర్థిక సలహాదారు (సీఈఏ) కేవీ సుబ్రమణియన్ శుక్రవారం తన పదవికి రాజీనామా చేశారు. ఆయనను మరికొంత కాలం అదే పోస్టులో కొనసాగించాలని కేంద్రప్రభుత్వం భావించింది. అందుకే కొత్త సీఈఏ ఎంపిక ప్రక్రియను కూడా ప్రారంభించలేదు. కానీ, అనూహ్యంగా సుబ్రమణియన్ తన పదవికి రాజీనామా చేశారు. కేంద్రం సుబ్రమణియన్నే కొనసాగించాలని భావిస్తున్నప్పటికీ ఆయన రాజీనామా చేయడం మరోసారి చర్చను లేవనెత్తుతున్నది. బీజేపీ అధికారంలోకి వచ్చినప్పుడు ఆర్బీఐ గవర్నర్గా ఉన్న రఘురామ్ రాజన్తో ప్రారంభమైన ఈ రాజీనామాల పర్వం ఇంకా కొనసాగుతూనే ఉన్నది. కేంద్ర ప్రభుత్వం చాలా మంది పదవీ కాలాన్ని పొడిగించాలని భావించినప్పటికీ వాళ్లు వెళ్లిపోతున్నారు. అయితే, కేంద్రం మాత్రం అందరూ వ్యక్తిగత కారణాలతోనే రాజీనామాలు చేస్తున్నారని సమర్థించుకొంటున్నది.
ఏరికోరి తెచ్చుకొన్న వాళ్లు కూడా
కేంద్ర ప్రభుత్వ విధానాలతో పదవులకు రాజీనామా చేసిన వారిలో.. బీజేపీ విధానాలను మొదటి నుంచి వ్యతిరేకించిన రఘురామ్ రాజన్ లాంటి వాళ్లే కాక, మోదీ ఎంతో ఇష్టంగా ఏరికోరి తెచ్చుకొన్న ఉర్జిత్ పటేల్ లాంటి వాళ్లు కూడా ఉన్నారు. రాజన్ నుంచి ప్రస్తుత శక్తికాంత దాస్ వరకు ముగ్గురు ఆర్బీఐ గవర్నర్లు మోదీ విధానాలపై అసంతృప్తి ప్రకటించడం విశేషం. ఆర్థిక సంస్థల స్వయంప్రతిపత్తిని దెబ్బతీయడానికి కేంద్రం ప్రయత్నించడం, ఆర్థిక వేత్తల సూచనలు పట్టించుకోకపోడం, ఒంటెత్తు పోకడలు ఇవన్నీ ఆర్థిక వేత్తలను అసహనానికి గురిచేస్తున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఆర్థిక క్రమశిక్షణే ముఖ్యం: రాజన్
రఘురామ్ రాజన్ను 2013లో ఆర్బీఐ గవర్నర్గా అప్పటి యూపీఏ ప్రభుత్వం నియమించింది. ఆయన 2016 వరకు ఆ పదవిలో ఉన్నారు. ఆర్థికపరంగా ఆయన ఎన్నో కఠిన నిర్ణయాలు తీసుకొన్నారు. వడ్డీ రేట్లను తగ్గించడానికి ఒప్పుకోలేదు. కేంద్రం ఆయనపై తీవ్ర ఒత్తిడి తీసుకువచ్చింది. అయినా ఆయన ఆర్థిక క్రమశిక్షణ వైపే మొగ్గు చూపారు. దీంతో మోదీ సర్కారు ఆయనపై కోపం పెంచుకొన్నది. రాజన్పై తీవ్ర ఆరోపణలు చేసింది. రఘురామ్ రాజన్ విదేశాలకు ఆర్థిక సమాచారం చేరవేస్తున్నారని బీజేపీ ఎంపీ సుబ్రమణ్య స్వామి ఆరోపించారు. దీనిపై ప్రభుత్వం సైలెంట్గా ఉంది. దీంతో రాజన్ తన పదవికి రాజీనామా చేశారు.
నీతి ఆయోగ్కు అధికారాల్లేవు: పనగరియా
నెహ్రూ హయాంలో తీసుకొచ్చిన ప్రణాళిక సంఘం స్థానంలో మోదీ ప్రభుత్వం నీతి ఆయోగ్ను తెచ్చింది. దానికి ఉపాధ్యక్షుడి ప్రధాని మోదీ అరవింద్ పనగరియాను నియమించారు. మోదీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు చేపట్టిన కార్యక్రమాలను పనగరియా గతంలో మెచ్చుకోవడమే ఇందుకు కారణమని అప్పట్లో వార్తలొచ్చాయి. 2015లో నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడిగా నియమితుడైన పనగరియా పదవీకాలం ముగియక మునుపే 2017లోనే రాజీనామా చేశారు. ప్రణాళిక సంఘానికి ఉన్న అధికారాలు నీతి ఆయోగ్కు లేవన్నారు. నీతి ఆయోగ్ కేవలం సిఫారసులు మాత్రమే చేయగలదని, ప్రభుత్వ పెత్తనమే ఎక్కువని పేర్కొన్నారు. డీమానిటైజేషన్ నిర్ణయాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు.
డీమానిటైజేషన్ క్రూరమైంది: అరవింద్ సుబ్రమణియన్
అరవింద్ సుబ్రమణియన్ 2016లో ప్రధాన ఆర్థిక సలహాదారుగా నియమితులయ్యారు. మరో ఏడాది కాలం సర్వీసు ఉండగానే 2018లో రాజీనామా చేశారు. డీమానిటైజేషన్ను తీవ్రంగా వ్యతిరేకించారు. అదొక దారుణమైన, క్రూరమైన చర్యగా అభివర్ణించారు.
జీడీపీ లెక్కింపులో మార్పు
బీజేపీ ప్రభుత్వం 2018లో వివాదాస్పద నిర్ణయం తీసుకొన్నది. జీడీపీ లెక్కింపు విధానంలో మార్పు చేసింది. దీనిపై అభ్యంతరం చెప్తూ అప్పటి జాతీయ గణాంక కమిషన్ సభ్యులు సీపీ మోహనన్, జేవీ మీనాక్షి రిజైన్ చేశారు.
ఆర్బీఐ స్వతంత్రత పోతున్నది: ఉర్జిత్ పటేల్
రాజన్ రాజీనామా చేశాక మోదీ ప్రభుత్వం ఉర్జిత్ పటేల్ను ఆర్బీఐ గవర్నర్గా నియమించింది. ఆయన గుజరాత్కు చెందినవారు. మోదీ విధానాలను సమర్థించేవారు. మోదీ మనిషి అన్న ప్రచారం అప్పట్లో బాగా సాగింది. ఉర్జిత్ నియామకంపై అప్పుడే తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఉర్జిత్ కూడా మొదట్లో కేంద్రం విధానాలను వ్యతిరేకించలేదు. ఆర్బీఐ మిగులు నిధులను కేంద్ర అవసరాలకు ఇవ్వాలని మోదీ ప్రభుత్వం ఒత్తిడి తీసుకువచ్చింది. ఆరెస్సెస్ నేత గురుమూర్తిని ఆర్బీఐ బోర్డులో కూర్చోబెట్టింది. దీనిపై ఉర్జిత్ తీవ్ర వ్యతిరేకత ప్రకటించారు. ఆర్బీఐ స్వతంత్రత దెబ్బతింటున్నదంటూ బహిరంగ ప్రకటనలు చేశా రు. తన పదవికి రాజీనామా చేశారు.
పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గించట్లేదు: శక్తికాంత దాస్
ఉర్జిత్ తర్వాత శక్తికాంత దాస్ను ఆర్బీఐ గవర్నర్ అయ్యారు. శక్తికాంత దాస్ ఆర్థిక వేత్త కాదు. ఎంఏ హిస్టరీ చేశారు. ఆయన్ను ఆర్బీఐ గవర్నర్ చేయడంపై విమర్శలు వచ్చాయి. తొలుత సైలెంట్గా ఉన్న శక్తికాంత దాస్ కూడా ఇటీవల కేంద్రం విధానాలను విమర్శిస్తున్నారు. పెట్రోల్, డీజిల్ రేట్ల పెరుగుదలపై ఇటీవల మానిటరీ పాలసీ సమీక్షలో చర్చించారు. ద్రవ్యోల్బణం పెరుగుతున్నదని, కేంద్రం ఎంత చెప్పినా వినడం లేదని అన్నారు. పెట్రోల్ రేట్లు తగ్గించాలని చాలా సార్లు కోరామని చెప్పారు. ముడి చమురు ధరలు తగ్గినప్పుడు భారీగా పన్నులు పెంచిన కేంద్రం భారీగా ఆదాయాన్ని సమకూర్చుకొన్నదని వ్యాఖ్యానించడం విశేషం.