Indian Consulate in Shanghai | కరోనా మహమ్మారి మళ్లీ విజృంభించడంతో చైనాలోని పలు నగరాలు గడగడా వణికిపోతున్నాయి. దీన్ని కట్టడి చేయడానికి కఠిన లాక్డౌన్ అమలు చేస్తున్నా.. మహమ్మారి ఉధృతి నియంత్రణలోకి రావడం లేదు. ఈ నేపథ్యంలో షాంఘైలోని భారత్ కాన్సులేట్ ఓ నిర్ణయం తీసుకున్నది. తాత్కాలికంగా వ్యక్తిగత సేవలను నిలిపేస్తున్నట్లు తెలిపింది. తూర్పు చైనా ప్రాంతంలో జీవిస్తున్న ఇండియన్లు ఎమర్జెన్సీ సర్వీసుల కోసం బీజింగ్లోని భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించింది.
షాంఘై కాన్సులేట్ పరిధిలో వ్యక్తిగత సేవలు నిలిపివేస్తున్నా.. ఇండియన్ సిటిజన్స్కు తమ సిబ్బంది వర్క్ ఫ్రం సేవలందిస్తారని వివరించింది. ప్రస్తుతం షాంఘై సిటీలో 1000 మందికి పైగా భారతీయులు ఉన్నట్లు తెలుస్తున్నది. కేవలం బుధవారం నాడే షాంఘైలో 26 వేల కేసులు నమోదయ్యాయని చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ తెలిపింది.
వైరస్ను కట్టడి చేయడానికి అమలు చేస్తున్న లాక్డౌన్ ఆంక్షలతో స్థానికులు నిత్యావసరాల కోసం తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు. ఎన్నారైలు కూడా ఇబ్బందుల పాలవుతున్నట్లు తెలిసింది. ఈ పరిస్థితుల్లో స్థానిక అధికారుల సహకారంతో భారతీయ కుటుంబాలకు నిత్యావసరాల పంపిణీకి ప్రయత్నిస్తున్నట్లు షాంఘైలోని బారత్ కాన్సులేట్ జనరల్ నందకుమార్ తెలిపారు. మరోవైపు, షాంఘేలోని తమ కాన్సులేట్ సిబ్బంది, అధికారులు వెనక్కు రావాలని అమెరికా ఆదేశించింది.