Indian Coast Guard : ముంబై తీరం, అరేబియా సముద్రం మధ్యలో ఆయిల్ స్మగ్లింగ్ ముఠాను ఇండియన్ కోస్ట్ గార్డ్స్ (భారతీయ తీర రక్షక దళం) పట్టుకున్నారు. పశ్చిమ ముంబైకి 100 నాటికన్ మైళ్ల దూరంలో ఆయిల్ రవాణా జరుగుతుండగా, శుక్రవారం సీ-ఎయిర్ ఆపరేషన్ నిర్వహించి ఈ ముఠాను పట్టుకున్నట్లు ఇండియన్ కోస్ట్ గార్డ్ వెల్లడించింది.
కోస్ట్ గార్డ్ వెల్లడించిన వివరాల ప్రకారం.. సముద్రం మధ్యలో కొన్ని నౌకల ద్వారా అక్రమంగా ఆయిల్ స్మగ్లింగ్ జరుగుతోంది. అంతర్జాతీయంగా ఆయిల్ అమ్మకాలపై ఆంక్షలు ఉన్న దేశాల నుంచి వచ్చే నాసిరకం చమురును స్మగ్లింగ్ ముఠా సేకరిస్తుంది. సముద్రం మధ్యలోనే.. ఒక నౌక నుంచి మరో నౌకలోకి ఆయిల్ను మార్చి తీరానికి దగ్గరలో ఉన్న రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. దీని ద్వారా భారీ స్థాయిలో పన్నులు ఎగ్గొడుతున్నారు. లేటెస్ట్ టెక్నాలజీ, నిఘా పరికరాలు, ఇతర డాటా ఆధారంగా కోస్ట్ గార్డ్స్ ఈ ఆపరేషన్ నిర్వహించారు. మూడు అనుమానిత నౌకలను కోస్ట్ గార్డ్స్ నౌకలు చుట్టుముట్టి తనిఖీ చేశాయి.
డాక్యుమెంట్లు తనిఖీ చేయగా.. ఆయిల్ అక్రమ రవాణాను గుర్తించాయి. ఇదో అంతర్జాతీయ నెట్వర్క్ అని అనుమానిస్తున్నారు. ఈ ఆయిల్ అక్రమ రవాణాలో అనేక దేశాల పాత్ర ఉన్నట్లు గుర్తించారు.నౌకలతోపాటు అందులోని సిబ్బందిని స్వాధీనం చేసుకున్న కోస్ట్ గార్డ్స్ తీరానికి తరలించారు. నిందితులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు తెలిపారు.