Indian Army : శత్రు దేశాల సైనికుల దాడులను తిప్పికొట్టేందుకు భారత సైన్యం సదా సిద్ధంగా ఉంటుంది. అందులో భాగంగానే బాంబులను పసిగట్టడానికి డాగ్ స్క్వాడ్లను ఉపయోగిస్తుంది. ఈమధ్య మన సైనికులు డ్రోన్లను కూల్చివేయడానికి పక్షుల సాయం తీసుకుంటున్నారు. సరిహద్దు వెంట శత్రు దేశాల డ్రోన్లను కూల్చేయడానికి అర్జున్ అనే డేగకు శిక్షణ ఇచ్చారు. ఒక సైనికుడు అర్జున్కు చేతిలో పట్టుకున్న ఫొటో ఆన్లైన్లో వైరల్ అవుతోంది.
పంజాబ్, జమ్మూకాశ్మీర్ సరిహద్దులో డ్రోన్లను గుర్తించేందుకు భారత సైన్యం ఈ డేగను ఉపయోగిస్తోంది. ఈ ప్రాంతాల్లో పాక్ డ్రోన్ల తాకిడి ఎక్కువ. ఈమధ్య పాకిస్థాన్ నుంచి కొందరు డ్రోన్ల ద్వారా జమ్మూ కాశ్మీర్, పంజాబ్ సరిహద్దు ప్రాంతాలకు డ్రగ్స్, తుపాకులు, డబ్బుల్ని చేరవేస్తున్నారు. దాంతో, పాక్ నుంచి వచ్చే డ్రోన్లను కూల్చడంలో అర్జున్, డాగ్ స్వ్కాడ్ భారత సైన్యానికి సాయపడుతున్నాయి.
ఉత్తరాఖండ్లోని ఔలీలో భారతదేశం, అమెరికా సైన్యాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న యుధ్ అభ్యాస్లో అర్జున్, ఒక శునకం కలిసి డ్రోన్ ఉన్న ప్రాంతాన్ని గుర్తించాయి. 15 రోజుల పాటు జరగనున్న ఈ సైనిక విన్యాసాల్లో అమెరికా రెండో బ్రిగేడ్, మనదేశం నుంచి అస్సాం బ్రిగేడ్ సైనికులు పాల్గొంటున్నాయి. పోయిన ఏడాది అలస్కాలోని ఎల్మెండార్ఫ్ రిచర్డ్సన్ అనే ప్రాంతంలో భారత్, అమెరికా ఈ సైనికా విన్యాసాలు చేపట్టాయి.