న్యూఢిల్లీ : కొవిడ్-19 సెకండ్ వేవ్ తో కరోనా వైరస్ కేసులు గణనీయంగా పెరుగుతుండటంతో భారత సైన్యం సేవలను వినియోగించుకోవాలని కేంద్రం నిర్ణయించింది. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో తాత్కాలిక దవాఖానలను ఏర్పాటు చేయనున్నట్టు సైన్యం వెల్లడించింది. ఆక్సిజన్ ట్యాంకర్ల దిగుమతి, సమర్ధవంతంగా వాటిని తరలించేందుకు అవసరమైన మానవ వనరులను సైన్యం సమకూర్చనుంది.
ఇక అంతకుముందు ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణే ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. భారత్ లో కొవిడ్-19 వ్యాప్తితో ఉత్పన్నమైన పరిస్థితిని ఎదుర్కోవడంలో సైన్యం చేపడుతున్న చర్యలను ఈ సందర్భంగా నరవణే ప్రధానికి వివరించారు. మరోవైపు గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 3,79,257 తాజా కేసులు వెలుగు చూడగా ఒక్కరోజులోనే మహమ్మారి బారినపడి 3645 మంది మరణించారు. 2,69,507 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు.