న్యూఢిల్లీ: అరుణాచల్ ప్రదేశ్కు చెందిన 17 ఏళ్ల మిరమ్ తారన్ అనే బాలుడిని చైనాకు చెందిన ఆర్మీ ఎత్తుకెళ్లినట్ల ఆ రాష్ట్రానికి చెందిన ఎంపీ తాపిర్ గావో ఆరోపించిన విషయం తెలిసిందే. అయితే ఈ అంశంపై ఇండియన్ ఆర్మీ రియాక్ట్ అయ్యింది. మిరమ్ తారన్ ఆచూకీ లేనట్లు తెలిసిన వెంటనే చైనా సైన్యానికి ఇండియన్ ఆర్మీ ఫోన్ చేసింది. హాట్లైన్ ద్వారా పీఎల్ఏకు తారన్ గురించి తెలిపింది. ప్రోటోకాల్ ప్రకారం అతన్ని అప్పగించాలని భారత సైన్యం కోరింది. ఔషధ మొక్కలు, వేట కోసం వెళ్లిన మిరమ్ తప్పిపోయినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆ కుర్రోడిని పట్టించి అప్పగించాలని పీఎల్ఏను భారత ఆర్మీ కోరింది.
సియాంగ్ జిల్లా నుంచి మిరమ్ను అపహరించినట్లు నిన్న ఎంపీ తాపిర్ ఆరోపించారు. ఈ ఘటనపై రాహుల్ గాంధీ ఇవాళ ఓ ట్వీట్ చేశారు. రిపబ్లిక్ డేకు కొన్ని రోజుల ముందే దేశ భవిష్యత్తు అయిన ఓ యువ బాలుడిని చైనా కిడ్నాప్ చేసిందని, మిరమ్ తారన్ కుటుంబానికి అండగా తాము ఉన్నామని, ఓటమిని అంగీకరించమని, అతని కోసం పోరాడుతామన్నారు. కానీ ఈ ఘటన పట్ల ప్రధాని మోదీ మౌనం వీడాలన్నారు. కిడ్నాప్ అయిన అరుణాచల్ బాలుడిని మోదీ పట్టించుకోవడం లేదని రాహుల్ ఆరోపించారు.
రాష్ట్రంలోని లుంగ్తా జోర్ ప్రాంతం నుంచి మిరమ్ను అపహరించినట్లు ఎంపీ తాపిర్ గావో ఓ ట్వీట్లో తెలిపారు. తారన్ స్నేహితుడు జానీ యయింగ్ పీఎల్ఏ దళాల నుంచి తప్పించుకున్నాడని, ఆ కుర్రాడు ఇచ్చిన సమాచారంతో తారన్ కిడ్నాప్కు గురైనట్లు తెలుస్తోందని ఎంపీ తాపిర్ తెలిపారు. తారన్, యాయింగ్లు స్థానికంగా వేటకు వెళ్లేవారు. భారత్లోకి సాంగ్పో నది ప్రవేశించే ప్రాంతంలో అపహరణ ఘటన చోటుచేసుకున్నది. అరుణాచల్ ప్రదేశ్లోని సాంగ్పో ప్రవేశించినప్పుడు దాన్ని సియాంగ్ నదిగా పిలుస్తారు. అదే నది అస్సాంలో ప్రవేశించినప్పుడు బ్రహ్మపుత్రగా పిలుస్తారు.