Army | ఎల్ఏసీ వెంబడి తాము రోబోటిక్ జవాన్లను పహారాకు పెట్టామన్న చైనా వ్యాఖ్యలపై భారత సైన్యం స్పందించింది. ఎల్ఏసీ వెంబడి రోబోటిక్ జవాన్ల ఏర్పాటేమీ తమకు కనిపించడం లేదని తేల్చి చెప్పింది. ఒకవేళ అదే గనక నిజమైతే.. తీవ్రమైన చలి నుంచి చైనా జవాన్లు బయటపడినట్లేనని, ఈ భీకరమైన చలిని తట్టుకోవడం వారి తరం కాదని భారత సైన్యం వ్యాఖ్యానించింది.
‘ఇప్పటి వరకైతే రోబోటిక్ సైన్యాన్ని సరిహద్దుల వెంబడి మేం చూడలేదు. ఒకవేళ చైనా సైన్యం గనక రోబోటిక్ సైన్యాన్ని సరిహద్దుల వెంబడి మోహరిస్తే వారికే మంచిది. ఎందుకంటే తీవ్రమైన చలి నుంచి తమను తాము రక్షించుకోవాల్సిన అవసరం వారికి ఎంతైనా ఉంది. ఇంతటి భీకర చలిని తట్టుకోవడం చైనా సైనికుల తరం కాదు’ అని భారత సైన్యం పేర్కొంది. ఇంతటి చలి తీవ్రతలో చైనా సైనికులు విధులు నిర్వర్తించాల్సి రావడం ఇది రెండోసారి. అయితే భారత సైన్యం మాత్రం ప్రతి యేడాది ఇంతటి చలిలోనూ విధులు నిర్వర్తిస్తూనే ఉంటుంది.
సరిహద్దుల్లో ఉన్న చలి చైనా సైనికుల మానసిక స్థైర్యాన్ని దెబ్బతీస్తోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. సరిహద్దుల్లో ఉన్న చలి తీవ్రతను చైనా సైనికులు తట్టుకోలేకపోతున్నట్లు సమాచారం. చలి తీవ్రతను చూసి అసలు బ్యారక్ల నుంచే బయటికి రావడం లేదని తెలుస్తోంది. పహారా నిమిత్తం కొంత సేపు మాత్రం బ్యారక్ నుంచి బయటికి వచ్చి, కొద్ది సేపటికే మళ్లీ బ్యారక్లోకి వెళ్లిపోతున్నారని కొన్ని వర్గాలు పేర్కొంటున్నాయి. గత సంవత్సరం కూడా అచ్చు ఇలాంటి పరిస్థితులను చైనా సైనికులు ఎదుర్కొన్నారు. దాదాపు 90 శాతం మందిని చైనా ప్రభుత్వం అక్కడి నుంచి తప్పించింది. ఎందుకంటే సైనికులందరికీ విపరీతమైన జలుబు పట్టేసిందని, దీని కారణంగా చైనా జవాన్లు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారని మీడియాలో కథనాలు కూడా వచ్చాయి.