న్యూఢిల్లీ : భారత సైన్యం కట్టుదిట్టమైన భద్రత గల మొబైల్ ఎకో సిస్టమ్ను అభివృద్ధి చేసింది. సెక్యూర్ ఆర్మీ మొబైల్ భారత్ వెర్షన్ (సంభవ్) అని పిలుస్తున్న ఈ వ్యవస్థలో మూడో కంటికి తెలియకుండా సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకోవచ్చునని చెప్పింది. భారత దేశ రక్షణ సామర్థ్యాలలో ఇది గొప్ప ముందడుగు అని తెలిపింది. ప్రముఖ విద్యా, పారిశ్రామిక నిపుణుల సహకారంతో సంభవ్ను అభివృద్ధి చేసినట్లు తెలిపింది. 5జీ టెక్నాలజీతో ఈ వ్యవస్థ పని చేస్తుందని చెప్పింది. ప్రజలు-సైన్యం ఈ టెక్నాలజీని ఉపయోగించుకోవచ్చు. ప్రారంభంలో రెండు దశల్లో 35,000 మొబైల్ హ్యాండ్ సెట్స్ను ఈ టెక్నాలజీతో వినియోగిస్తామని, ఈ నెల 15న 2,500 సెట్లను, మే 31నాటికి 32,500 సెట్లను వినియోగిస్తామని చెప్పారు.