న్యూఢిల్లీ : తూర్పు లడఖ్లో చైనా దుందుడుకు వైఖరి నేపధ్యంలో ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రాంతంలో నియంత్రణ రేఖ వెంబడి (ఎల్ఏసీ) చైనా తన సేనలను తగ్గించలేదని స్పష్టం చేశారు. సరిహద్దుల్లో పరిస్ధితి నిలకడగా ఉన్నా ఊహించలేని పరిస్ధితి నెలకొందని అన్నారు. డెంచోక్, డెప్సాంగ్ ప్రాంతంలో వివాద పరిష్కారం కోసం తదుపరి దశ చర్చలు సాగుతాయని చెప్పారు.
తూర్పు లడఖ్లో పరిస్ధితి ఒక్క పదంలో వెల్లడించాలంటే పరిస్ధితి నిలకడగా ఉన్నా ఎప్పుడేం జరుగుతుందనేది ఊహించలేమని పాండే ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ పేర్కొన్నారు. సరిహద్దు ప్రాంతంలో చైనా హెలిఫాడ్లు, ఎయిర్ఫీల్డ్, రోడ్ల నిర్మాణం చేపడుతోందనే వార్తల నేపధ్యంలో జనరల్ మనోజ్ పాండే ఈ వ్యాఖ్యలు చేశారు.
ఎల్ఏసీకి సమాంతరంగా ఉన్న జీ695 హైవే ద్వారా సేనలను ముందుకు తరలించేందుకు, ఒక సెక్టార్ నుంచి మరో సెక్టార్కు బదలాయించే అవకాశం కలిగిందని అన్నారు. ఎలాంటి అత్యవసర పరిస్ధితి ఎదురైనా దీటుగా ఎదుర్కొనేందుకు భారత్ సంసిద్ధంగా ఉందని చెప్పారు. భారత్ తగినన్ని వనరులు, సరిపడనంత బలగాలను మోహరించి సర్వసన్నద్ధంగా ఉందని పేర్కొన్నారు.