ఇటానగర్/బొమ్మలరామారం, మార్చి 16: అరుణాచల్ ప్రదేశ్లో ఆర్మీకి చెందిన చీతా హెలికాప్టర్ కూలిపోయింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు పైలట్లు మృతి చెందారు. మృతుల్లో తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారానికి చెందిన లెఫ్ట్నెంట్ కర్నల్ వినయ్ భానురెడ్డి కూడా ఉన్నారు. అరుణాచల్లోని సాంగే గ్రామం నుంచి అస్సాంలోని సాంటిపూర్ జిల్లా మిస్సమరికి గురువారం ఉదయం 9 గంటలకు హెలికాప్టర్ బయలుదేరింది. అయితే అరుణాచల్లోని పశ్చిమ కమెంగ్ జిల్లా మండల సమీపంలో 9.15 గంటల సమయంలో ఎయిర్ కంట్రోల్ ట్రాఫిక్తో హెలికాప్టర్కు సంబంధాలు తెగిపోయినట్టు ఆర్మీ ప్రతినిధి లెఫ్టినెంట్ కర్నల్ మహేంద్ర రావత్ తెలిపారు.
ఈ ప్రమాదంలో ఇద్దరు పైలట్లు మృతి చెందినట్టు ఆయన చెప్పారు. మృతుల్లో తెలంగాణకు చెందిన లెఫ్ట్నెంట్ కర్నల్ వినయ్ భానురెడ్డి (34)తోపాటు మేజర్ జయంత్ ఉన్నట్టు చెప్పారు. కాగా కూలిన హెలికాప్టర్ దీరంగ్ సమీపంలో మంటల్లో దగ్ధమౌతూ కన్పించినట్టు అక్కడి గ్రామస్థులు మధ్యాహ్నం 12.30 గంటలకు సమాచారం ఇచ్చారని స్పెషల్ ఇన్విస్టిగేషన్ సెల్ ఎస్పీ రోహిత్ రాజ్బీర్ సింగ్ తెలిపారు. ప్రమాదం జరిగిన ప్రాంతం లో దట్టమైన పొగమంచు ఆవరించి ఉంది. ఐదు మీటర్ల పరిధి వరకే కన్పిస్తున్నది. దీని కారణంగానే ప్రమాదం జరిగి ఉండవచ్చునని భావిస్తున్నారు. దీనిపై విచారణ జరుపుతున్నట్టు కర్నల్ మహేంద్ర రావత్ తెలిపారు.
ప్రమాదంలో మృతి చెందిన లెఫ్ట్నెంట్ కర్నల్ వినయ్ భానురెడ్డికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆయన భార్య కూడా పుణె ఆర్మీ క్యాంపులో డెంటిస్ట్గా పనిచేస్తున్నారు. వినయ్ భానురెడ్డి మరణ వార్తతో బొమ్మలరామారంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. స్థానికంగా ఉన్న ఆయన సొంత వ్యవసాయ క్షేత్రంలోనే అంతిమ సంస్కారాలు నిర్వహించాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు.