న్యూఢిల్లీ: ఉక్రెయిన్లో చిక్కుకున్న భారతీయులను తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ గంగాను చేపట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే వేలాది మంది విద్యార్థులను ఇండియాకు తీసుకువచ్చారు. అయితే ఇప్పుడు ఆపరేషన్ గంగాకు వాయుసేన కూడా తోడవ్వనున్నది. తరలింపు ప్రక్రియను వేగవంతం చేసేందుకు వాయుసేన కూడా ఆ ఆపరేషన్లో భాగంగా కావాలని ప్రధాని మోదీ ఆదేశాలు జారీ చేశారు. అతి తక్కువ సమయంలో ఎక్కువ మందిని తరలించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఆపరేషన్ గంగా కోసం వాయుసేనకు చెందిన సీ-17 గ్లోబ్మాస్టర్ విమానాన్ని వాడనున్నట్లు తెలుస్తోంది. ఇవాళ ఉదయం ఉక్రెయిన్ అంశం గురించి రాష్ట్రపతి రామ్నాథ్తో ప్రధాని మోదీ చర్చించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.