న్యూఢిల్లీ: యుద్ధభూమి ఉక్రెయిన్లో (Ukraine) చిక్కుకుపోయిన భారతీయుల తరలింపు కొనసాగుతున్నది. ఆపరేషన్ గంగలో భాగమైన భారత వాయుసేనకు చెందిన రెండు సీ-17 విమానాలు (C-17 Flights) 420 మందితో ఢిల్లీకి చేరాయి. రొమేనియా రాజధాని బుకారెస్ట్ నుంచి 200 మందితో ఒక విమానం, హంగెరీ రాజదాని బుడాపెస్ట్ నుంచి 220 మంది భారతీయులతో మరో సీ-17 విమానం ఢిల్లీలోని హిండన్ ఎయిర్ బేస్కి చేరుకున్నాయి. స్వదేశానికి చేరుకున్న భారతీయులకు కేంద్ర మంత్రులు అజయ్ భట్, రాజీవ్ చంద్రశేఖర్ స్వాగతం పలికారు. కాగా, మరో 300 మందితో కూడిన మూడు సీ-17 విమానాలు గురువారం ఉదయం 8 గంటలకు ఢిల్లీకి చేరుకోనున్నాయని సమాచారం.
#WATCH | Another Indian Air Force's C-17 aircraft carrying 220 Indian passengers on board lands at its home base Hindan near Delhi, arriving from Budapest in Hungary
MoS Defence Ajay Bhatt interacted with the Indian nationals coming from #Ukraine#OperationGanga pic.twitter.com/AOuEmHEjv5
— ANI (@ANI) March 3, 2022
ఉక్రెయిన్పై రష్యా దాడి నేపథ్యంలో ఫిబ్రవరి 24న ఆ దేశం తన గగనతలం మూసివేసింది. దీంతో ఉక్రెయిన్ పశ్చిమాన ఉన్న రొమేనియా, హంగేరి, పోలాండ్ దేశాల నుంచి భారత్ ప్రత్యేక విమానాలను నడుపుతున్నది. వీటి ద్వారా అక్కడ చిక్కుకుపోయిన భారతీయ పౌరులను తరలిస్తున్నది. ఉక్రెయిన్ నుంచి బుధవారం మొత్తం 1,377 మంది భారతీయులు దేశానికి వచ్చినట్టు కేంద్రం తెలిపింది. కాగా, ఉక్రెయిన్లో మరో 8 వేల మంది చిక్కుకుపోయినట్లు కేంద్ర విదేశాంగ కార్యదర్శి హర్షవర్ధన్ శ్రింగ్లా చెప్పారు.
#WATCH | Union Minister Rajeev Chandrasekhar interacts with around 200 Indian citizens repatriated from #Ukraine, as an Indigo special flight lands in Delhi from Bucharest in Romania.#OperationGanga pic.twitter.com/YMgiTuqyBZ
— ANI (@ANI) March 2, 2022
ఈశాన్య ఉక్రెయిన్-రష్యా సరిహద్దులోని సుమీ యూనివర్సిటీకి చెందిన 600 మందికి పైగా భారత విద్యార్థులు చిక్కుకుపోయారు. ఇప్పటి వరకు ఇక్కడి నుంచి ఒక్క విద్యార్థిని కూడా తరలించలేదని, ఆ దిశగా ఎంబసీ కూడా హామీ ఇవ్వలేదని విరాజ్ వాల్డే అనే విద్యార్థి పేర్కొన్నారు. మరోవైపు, భారత జెండాను చూపించి పాక్, టర్కీ దేశాల విద్యార్థులు సరిహద్దులకు సురక్షితంగా చేరుకొంటున్నట్టు కొందరు భారతీయ విద్యార్థులు పేర్కొన్నారు.