US-Iran ceasefire : ఇరాన్-అమెరికా మధ్య రెండువారాలపాటు కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. దీంతో పశ్చిమాసియాలో తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొనబోతున్నాయి. ఈ అంశంపై భారత్ స్పందించింది. ఇరాన్-అమెరికా మధ్య కుదిరిన ఒప్పందాన్ని స్వాగతిస్తున్నట్లు ఇండియా ప్రకటించింది. ఈ నిర్ణయం పశ్చిమాసియాలో శాంతికి దోహదపడుతుందని అభిప్రాయపడింది. ఈ మేరకు కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది.
‘‘మేం కాల్పుల విరమణను స్వాగతిస్తున్నాం. ఇది పశ్చిమాసియాలో శాంతి స్థాపనకు ఉపయోగపడుతుందని భావిస్తున్నాం. ప్రస్తుత సంక్షోభాన్ని నివారించేందుకు, ఉద్రిక్తతలు తగ్గించేందుకు చర్చలు, దౌత్యపరమైన నిర్ణయాలు అవసరమని ఎప్పటినుంచో చెబుతున్నాం. ఇప్పటికే ఈ సంక్షోభం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చమురు రవాణా, వాణిజ్య అంశాలకు ఆటంకం ఏర్పడింది. ఈ కాల్పులు విరమణ ఒప్పందం ద్వారా ఇకపై హార్ముజ్ జలసంధి నుంచి స్వేచ్ఛా వాణిజ్య కార్యకలాపాలు జరుగుతాయని ఆశిస్తున్నాం’’ అంటూ కేంద్రం ప్రకటించింది. యుద్ధం, బలప్రయోగం కంటే చర్చలు, దౌత్యపరమైన మార్గాల ద్వారానే శాంతి లభిస్తుందనే విధానానికి తాము కట్టుబడి ఉన్నట్లు ఇండియా మరోసారిపేర్కొంది.
40 రోజులపాటు సాగిన ఇరాన్ యుద్ధానికి బుధవారం ఉదయం నుంచి తాత్కాలిక విరామం లభించింది. ఇరాన్-అమెరికా మధ్య రెండువారాలపాటు శాంతి ఒప్పందం కొనసాగనుంది. ఈ లోపు ఇరు దేశాలు పాకిస్తాన్లోని ఇస్లామాబాద్ వేదికగా చర్చలు జరిపే అవకాశం ఉంది. ఈ చర్చలు కూడా కొలిక్కివచ్చి, ఇరు దేశాలు ఒక అభిప్రాయానికి వస్తే యుద్ధానికి శాశ్వత ముగింపు పలికే సూచనలు కనిపిస్తున్నాయి.