న్యూఢిల్లీ: ఆఫ్ఘనిస్థాన్లో తాలిబన్ పాలన, అనంతర పరిణామాలపై భారత్ కీలక సమావేశం నిర్వహించనున్నది. దీని కోసం చైనా, పాకిస్థాన్లను కూడా ఆహ్వానించింది. 2018 సెప్టెంబర్, 2019 డిసెంబర్లో ఢిల్లీ ప్రాంతీయ భద్రతా సమావేశం జరిగింది. అయితే కరోనా నేపథ్యంలో గత ఏడాది ఇది జరుగలేదు.
కాగా, నవంబర్ 10న జరగనున్న ఈ సమావేశానికి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ అధ్యక్షత వహిస్తారని సంబంధిత వర్గాలు తెలిపాయి. తొలిసారి రష్యా, ఇరాన్తోసహా మధ్య ఆసియాలోని అన్ని దేశాలు ఇందులో పాల్గొంటాయని చెప్పాయి. భారత్ ఆహ్వానంపై ఆయా దేశాలు చాలా బాగా స్పందించాయని ఆ వర్గాలు వెల్లడించాయి.
‘ఆఫ్ఘనిస్థాన్లో శాంతి, భద్రతను పెంపొందించే ప్రాంతీయ ప్రయత్నాలలో భారతదేశ పాత్రకు ఉన్న ప్రాముఖ్యతకు ఈ ఉత్సాహభరితమైన ప్రతిస్పందన నిదర్శనం’ అని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. చైనా, పాకిస్థాన్ను కూడా భారత్ ఆహ్వానించిందని, అయితే వారి నుంచి ఇంకా ఎలాంటి స్పందన రాలేదని తెలిపాయి.
మరోవైపు ఈ సదస్సుకు తాము హాజరుకాబోమని మీడియా ద్వారా పాక్ స్పష్టం చేసింది.