న్యూఢిల్లీ: జపాన్ మాజీ ప్రధాని షింజో అబే ఇవాళ హత్యకు గురయ్యారు. షూటర్ కాల్పుల్లో గాయపడ్డ ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. షింజో అబే మృతికి నివాళిగా శనివారం భారత్లో సంతాప దినం పాటించనున్నారు. ఈ విషయాన్ని ప్రధాని మోదీ ప్రకటించారు. షింజో మేటి రాజకీయవేత్త అని, అసాధారణ నేత అని, సాటిలేని పరిపాలనా కొనసాగించారని మోదీ అన్నారు. తమ మధ్య ఎన్నో ఏళ్ల సంబంధం ఉన్నట్లు ప్రధాని మోదీ తన ట్విట్టర్లో గుర్తు చేశారు. మిత్రుడు షింజో అబే మృతి పట్ల షాక్కు గురయ్యానని, తనకు మాటలు రావడం లేదన్నారు.
జపాన్ ప్రజల కోసం ఆయన తన జీవితాన్ని అంకితం చేశారన్నారు. షింజో అబేకు ఆర్థిక అంశాలపై లోతైన పట్టు ఉందని, ఆయన విదేశీ విధానం కూడా తనను ఎంతో ఆకర్షించినట్లు మోదీ తెలిపారు. ఇటీవల జపాన్ వెళ్లినప్పుడు అబేను కలిసినట్లు తెలిపారు. అబే మృతి పట్ల భారత దేశం సంతాపం ప్రకటిస్తోందని, కష్టసమయంలో జపాన్ సోదరసోదరీమణులకు సంఘీభావంగా నిలుస్తుందని మోదీ తెలిపారు. షింజో పట్ల ఉన్న తమకు అమితమైన గౌరవం ఉందని, ఆయన మృతికి నివాళిగా జూలై 9వ తేదీన జాతీయ సంతాపం దినంగా పాటించనున్నట్లు మోదీ తెలిపారు. తన ట్విట్టర్లో ఇటీవల షింజోతో దిగిన ఫోటోను మోదీ షేర్ చేశారు.
As a mark of our deepest respect for former Prime Minister Abe Shinzo, a one day national mourning shall be observed on 9 July 2022.
— Narendra Modi (@narendramodi) July 8, 2022