India Summons : హార్ముజ్ జలసంధి వద్ద కీలక పరిణామం చోటు చేసుకుంది. జలసంధిని దాటేందుకు ప్రయత్నించిన భారత నౌకలపై ఇరాన్ నేవీ కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. దీంతో ఇండియాలోని ఇరాన్ రాయబారికి కేంద్ర ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. ఈ ఘటనలు శనివారం జరిగాయి. ప్రస్తుతం హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసేసిన సంగతి తెలిసిందే. హార్ముజ్ను ఓపెన్ చేస్తున్నట్లు ప్రకటించి 24 గంటలు గడవకముందే ఇరాన్ యూటర్న్ తీసుకుని జలసంధిని మూసేసింది.
ఇదే సమయంలో జలసంధి నుంచి వెళ్లేందుకు జగ్ అర్నవ్, సాన్మర్ హెరాల్డ్ అనే రెండు భారత నౌకలు ప్రయత్నించగా, వాటిలో జగ్ అర్నవ్ అనే భారత చమురు నౌకపై ఇరాన్ నేవీ కాల్పులు జరిపింది. ఇరాక్ నుంచి రెండు మిలియన్ల బ్యారెళ్ల చమురుతో ఈ నౌక ఇండియా బయల్దేరింది. ఇది హార్ముజ్ జలసంధి వద్ద ఒమన్ ఉత్తర దిశలో ఉండగా ఇరాన్ నేవీ కాల్పులు జరిపింది. ఈ ఘటనలో ఎవరికీ, ఎలాంటి హానీ కలగలేదు. ఈ కాల్పుల కారణంగా ఈ రెండు నౌకలు తిరిగి వెనక్కి వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే, చిన్న ఆయుధాలతోనే కాల్పులు జరిపారని, ప్రత్యేకంగా నౌకల్ని లక్ష్యంగా ఎంచుకోలేదని అధికారులు తెలిపారు.
ఈ ఘటన నేపథ్యంలో ఇండియాలోని ఇరాన్ రాయబారికి భారత ప్రభుత్వం నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈ కాల్పుల ఘటన నేపథ్యంలో హార్ముజ్ జలసంధి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీనిపై ఇరాన్ నుంచి ఎలాంటి స్పష్టతా రాలేదు. ఇక, హార్ముజ్ వద్ద ప్రస్తుతం ఇండియన్ నేవీకి సంబంధించి ఎలాంటి నౌకలు లేవని అధికారులు తెలిపారు. అయితే, గల్ఫ్ ఆఫ్ ఒమన్ వద్ద రెండు డిస్ట్రాయర్ నౌకలు, ఒక ఫ్రిగేట్, ఒక ట్యాంకర్ ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.