మార్చి 31, 2022
శ్రీలంక అప్పటి అధ్యక్షుడు గోటబయ నివాసాన్ని ముట్టడించిన లంకేయులు.. వాహనాలకు నిప్పుపెట్టారు. తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, విద్యుత్తు, పెట్రోల్ను సరఫరా చేయలేని ప్రభుత్వం ఎందుకంటూ నిరసన ప్రదర్శనలను హోరెత్తించారు. ప్రజా ఉద్యమానికి జడిసి అధ్యక్షుడే దేశాన్ని విడిచిపెట్టి
పరారయ్యారు.
జనవరి 10, 2023
వందలాది మంది పాకిస్థానీలు ఆర్తనాదాలు చేస్తూ గోధుమ పిండి ట్రక్కు వెనుక పరుగులు పెట్టారు. గ్యాస్ సరఫరా నిలిచిపోవడంతో ప్లాస్టిక్ కవర్లలో జాగ్రత్తగా ఎల్పీజీని నింపుకొని ఇండ్లకు పట్టుకుపోయారు. విద్యుత్తు కొరతతో ప్రభుత్వం సమావేశాలను పగటిపూటే నిర్వహిస్తున్నది. ఇదీ దాయాది దేశం పాకిస్థాన్లో దుస్థితి.
మరికొద్ది రోజుల్లో..
శ్రీలంక, పాకిస్థాన్లో తలెత్తిన పరిస్థితులే త్వరలో దేశంలోనూ తారసపడొచ్చు. ఎగవేతదారులు మరింతగా పెరిగి బ్యాంకింగ్ వ్యవస్థ కుప్పకూలొచ్చు. ప్రభుత్వానికి ముందుచూపు లేకపోవడంతో ఆహార నిల్వలు మరింతగా అడుగంటిపోవచ్చు. ఇప్పటికే లక్షల కోట్ల అప్పులు తీసుకొన్న కేంద్రానికి కొత్త రుణాలు ఇవ్వడానికి ఎవరూ ముందుకు రాకపోవచ్చు. వెరసి ఆహార, ఆర్థిక సంక్షోభంతో భారత్ దివాళా అంచునకు చేరొచ్చు. ఇది ఎనిమిదిన్నరేండ్ల బీజేపీ పాలన వల్లే.
(స్పెషల్ టాస్క్ బ్యూరో)హైదరాబాద్, జనవరి 21 (నమస్తే తెలంగాణ): స్వతంత్ర భారతంలో ఎన్నడూ చూడని దుర్భర పరిస్థితిని ప్రస్తుతం ప్రజలు చూస్తున్నారు. ప్రభుత్వ అప్పులు పెరిగిపోయాయి. పారిశ్రామిక వృద్ధి పడకేయడంతో నిరుద్యోగం విలయతాండవం చేస్తున్నది. బ్యాంకు మోసాలు రెట్టింపయ్యాయి. ధరలు పెరుగడంతో సామాన్యుల కొనుగోలు శక్తి తగ్గిపోయింది. మూడుపూటలు తినే నిరుపేద జీవి.. రెండు పూటలకే పరిమితమవుతున్నాడు. నాలుగేండ్లకు సరిపడా ఆహార రాశిని నిల్వ చేసుకోవాల్సిన ప్రభుత్వం చేతులెత్తేసింది. గత ఎనిమిదిన్నరేండ్ల పాలనలో బీజేపీ ఘనకార్యాలివి.
అప్పుల కుప్పగా భారత్
బీజేపీ ప్రభుత్వం ఎనిమిదిన్నరేండ్లలో రూ.91 లక్షల కోట్ల అప్పులు చేసింది. మొత్తం అప్పులు రూ.147 లక్షల కోట్లకు చేరాయి. ఈ లెక్కన దేశంలోని ప్రతి పౌరుడి నెత్తిమీద రూ. లక్ష రుణం ఉన్నట్టు లెక్క. డాలర్తో రూపాయి మారకం విలువ పడిపోతుండటం, విదేశీ పోర్ట్ఫోలియో పెట్టుబడులు దేశం నుంచి తరలివెళ్లిపోతుండటంతో భారత విదేశీ మారక నిల్వలు క్షీణిస్తున్నాయి. ప్రస్తుతం నిల్వలు 524 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. ఇది రెండున్నరేండ్ల కనిష్ఠం. వెరసి కొత్త రుణాలు పుట్టడం లేదు.
బ్యాంక్ మోసాలు డబుల్
2014లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు బ్యాంకులు రూ.14.38 లక్షల కోట్ల మొండి బకాయిలను రైటాఫ్ చేశాయి. బ్యాంకింగ్ మోసాలూ డబుల్ అయ్యాయి. 2013-14లో 4,306 బ్యాంకు మోసాలు జరిగితే, 2021-22లో 9,103 జరిగాయని ఆర్బీఐ వెల్లడించింది. 2014లో నిరర్ధక ఆస్తుల (ఎన్పీఏ) గ్రాస్ రేటు 4.1 శాతంగా ఉంటే, ప్రస్తుతం 6.5 శాతానికి చేరింది. అంతర్జాతీయ నిబంధనల ప్రకారం.. బ్యాంకుల ఎన్పీఏ గ్రాస్ రేటు 1-2 శాతానికి మించి ఉండకూడదు.
ధరలు ఆకాశంలో.. నిల్వలు పాతాళంలో
ద్రవ్యోల్బణం కారణంగా 2014 నుంచి ఇప్పటి వరకు నిత్యావసర వస్తువుల ధరలు దాదాపు 300 శాతం పెరిగాయి. డీజిల్పై 512 శాతం, పెట్రోల్పై 194 శాతం ఎక్సైజ్ పన్ను, వంటగ్యాస్ ధరను 185 శాతం పెంచడంతో ఇంధనం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. వ్యవసాయ పెట్టుబడి పెరిగింది. రవాణా చార్జీలు, ఉత్పాదక ఖర్చులు కూడా పెరగడంతో.. ఆ ప్రభావం బియ్యం, నూనె, పాలు, ఉప్పు, చక్కెర వంటి నిత్యావసరాలపై పడింది. దేశప్రజలు ప్రధానంగా వినియోగించే గోధుమలు, బియ్యం నిల్వలు ఎఫ్సీఐ దగ్గర అంతకంతకూ క్షీణిస్తున్నాయి. గత సెప్టెంబర్ నాటికి రెండు ధాన్యాలు కలిపి ఎఫ్సీఐ వద్ద మొత్తంగా 4.92 కోట్ల టన్నుల నిల్వలు ఉన్నాయి. అంతకుముందు ఏడాదితో పోలిస్తే, ఇది 60 శాతం తక్కువ. నిబంధనల ప్రకారం ఎఫ్సీఐ ఎప్పుడూ మూడు, నాలుగేండ్లకు సరిపడా ధాన్యం నిల్వలను ఉంచుకోవాలి. అయితే, ఆ పరిస్థితి కనిపించట్లేదు. దీంతో ఆహారం సంక్షోభం ఎప్పుడైనా ముంచుకురావొచ్చని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నిరుద్యోగం పైపైకి..
ప్రధాని మోదీ హయాంలో దేశంలో నిరుద్యోగం అంతకంతకూ పెరిగిపోతున్నది. దేశంలో పారిశ్రామిక ప్రగతి పడకేయడంతో యువతకు ఉపాధి అవకాశాలు మృగ్యమయ్యాయి. దేశంలోని 85 కోట్ల మంది శ్రామిక శక్తిలో పనికి తగ్గ వేతనం పొందుతున్న వారు కేవలం 30.4 కోట్ల మంది మాత్రమే ఉన్నారు. 32.8 కోట్ల మంది తగిన ఉద్యోగం దొరికేంత వరకు చిన్నాచితక పనులు చేస్తుండగా, ఇప్పటికిప్పుడు ఉద్యోగం కావాల్సినవారి సంఖ్య 21.8 కోట్లుగా ఉన్నది.