CDS : అణు దేశాలైన చైనా (China), పాకిస్థాన్ (Pakistan) ల నుంచి ముప్పు పొంచి ఉన్నదని సీడీఎస్ (Chief of Defence Staff – CDS) జనరల్ అనిల్ చౌహాన్ (General Anil Chauhan) కీలక వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదం, సరిహద్దు వివాదాలు సవాళ్లుగా ఉన్నాయని గుర్తుచేశారు. స్వల్పకాలిక, సుదీర్ఘ యుద్ధాలకు భారత్ సిద్ధంగా ఉండాలని సూచించారు. ఈ మేరకు ఐఐటీ బాంబే (IIT Bombay) లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
మన ఇద్దరు ప్రత్యర్థులు అణుసామర్థ్యం కలిగి ఉన్నారని, ఆ దేశాల నుంచి వచ్చే ఎలాంటి సవాలునైనా ఎదుర్కోవడానికి మనం సిద్ధంగా ఉండాలని సీడీఎస్ అన్నారు. గతంలో నిర్వహించిన ఆపరేషన్ల మాదిరిగానే ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి స్వల్ప, దీర్ఘకాలిక ఘర్షణలకు సిద్ధంగా ఉండాలని చెప్పారు. ఇప్పటికే కొనసాగుతోన్న సరిహద్దు వివాదాల కారణంగా భూతల ఘర్షణల్లో పోరాడేందుకు రెడీగా ఉండాలన్నారు. కృత్రిమ మేథ, క్వాంటమ్ కంప్యూటింగ్, హైపర్ సోనిక్స్, రోబోటిక్స్, ఎడ్జ్ కంప్యూటింగ్ పోరాట తీరును మారుస్తున్నాయని చెప్పారు.