శతాబ్ది ఉత్సవాల నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారాలని, దీని కోసం చిత్తశుద్ధితో కృషి చేయాలని ప్రధాని నరేంద్రమోదీ జాతి జనులకు పిలుపునిచ్చారు. ‘పంచ ప్రాణాల’ పేరిట ఐదు లక్ష్యాలను నిర్దేశించారు. 76వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఎగురవేసిన అనంతరం ప్రధాని ప్రసంగించారు. దేశ ప్రగతికి నారీశక్తే పునాది అని, మహిళలను అందరూ గౌరవించాలన్నారు. మరోవైపు, ప్రపంచ దేశాల్లో ఉన్న భారతీయులు స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరిపారు. జాతీయ పతాకాన్ని ఎగురవేసి, జాతీయ గీతాన్ని ఆలపిస్తూ స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు. అమెరికా అధ్యక్షుడు బైడెన్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్ మెక్రాన్, ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ ఆల్బనీస్, రష్యా అధ్యక్షుడు పుతిన్ తదితరులు భారత ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
న్యూఢిల్లీ, ఆగస్టు 15: రానున్న శతాబ్ది ఉత్సవాల నాటికి (2047) అభివృద్ధి చెందిన దేశంగా భారత్ అవతరించనున్నదని ప్రధాని నరేంద్రమోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రజలంతా మరింత చిత్తశుద్ధితో కృషిచేయాలని పిలుపునిచ్చారు. 76వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఎగురవేసిన అనంతరం జాతిని ఉద్దేశించి 82 నిమిషాలపాటు ఆయన ప్రసంగించారు. స్వాతంత్య్ర సమరయోధుల కలలను సాకారం చేయడానికి ముఖ్యంగా ఐదు అంశాలపై దృష్టి సారించాలన్నారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ అవతరించడం, బానిసత్వ నిర్మూలన, వారసత్వాన్ని పరిరక్షించడం, ఐకమత్యం, పౌరులు బాధ్యతలను నిర్వర్తించడం.. వంటివి ఐదు ప్రధాన లక్ష్యాలుగా (పంచ ప్రాణాలుగా) ప్రధాని పేర్కొన్నారు. 75 ఏండ్ల స్వాతంత్య్ర దినోత్సవ సంబురాలు జరుపుకొంటున్న భారత్.. ఇప్పటికే సమస్యల పరిష్కారకర్తగా ప్రపంచం దృష్టిని ఆకర్షించిందని.. 130 కోట్ల మంది వజ్ర సంకల్పంతో 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా అవతరిస్తుందన్నారు. ‘అభివృద్ధి చెందిన దేశంగా భారత్ను మార్చడమే మన ముందున్న ప్రధాన లక్ష్యం’ అని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యానికి భారత్ తల్లివంటిదని అభివర్ణించారు. దేశం కోసం మహాత్మాగాంధీ, నేతాజీ, అంబేడ్కర్, వీర సావర్కర్ వంటి నేతలు ప్రాణత్యాగం చేశారని, వారి వల్లే స్వాతంత్య్రం సిద్ధించిందని తెలిపారు.
ముఖ్య అతిథులుగా సామాన్యులు
ఎర్రకోట వద్ద జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ సంబురాల్లో.. రాజకీయ ప్రముఖులతో పాటు పలువురు సామాన్యులు ఉత్సవాలకు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. జాబితాలో వీధి వ్యాపారులు, అంగన్వాడీ కార్యకర్తలు, మార్చురీ సిబ్బంది తదితరులు ఉన్నారు.
టెలిప్రాంప్టర్కు బదులు కాగితాలు
కీలకమైన ప్రసంగాలకు ప్రధాని మోదీ టెలిప్రాంప్టర్ సాయం తీసుకుంటారన్న విషయం తెలిసిందే. అయితే సోమవారం జాతినుద్దేశించి చేసిన ప్రసంగాన్ని కాగితాలను చూస్తూ మోదీ ప్రసంగించడం గమనార్హం. గత గణతంత్ర దినోత్సవం నాడు టెలిప్రాంప్టర్లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ప్రధాని ప్రసంగానికి అంతరాయం ఏర్పడింది. దీనిపై కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ గతంలో ట్వీట్ చేస్తూ.. ‘ప్రధాని చెప్పే అబద్దాలను ఆ టెలిప్రాంప్టర్ కూడా భరించలేకపోతున్నది’ అని ఎద్దేవా చేశారు. ఈ క్రమంలోనే ప్రధాని తాజాగా పేపర్ల సాయాన్ని తీసుకున్నారని చెబుతున్నారు.
మేడిన్ ఇండియా గన్తో గౌరవ వందనం
మువ్వన్నెల పతాకానికి సమర్పించే గౌరవ వందనానికి స్వదేశంలో తయారు చేసిన తుపాకీని వినియోగించారు. స్వదేశీ తుపాకీని జెండా వందనానికి వినియోగించడం 75 ఏండ్ల స్వాతంత్య్ర భారతంలో ఇదే తొలిసారి. ఇప్పటివరకూ ఈ వేడుకలకు బ్రిటీషర్ల గన్స్నే వాడేవారు. ‘మేడిన్ ఇండియా గన్తో మువ్వన్నెల జెండాకు గౌరవ వందనం సమర్పించాలని 75 ఏండ్ల నుంచి ఎదురుచూస్తున్నాం. ఇప్పుడు అది సాకారమైంది’ అని ప్రధాని అన్నారు. వేడుకల్లో పాల్గొన్న అతిథుల మీద పూలరేకులను వెదజల్లేందుకు తొలిసారిగా ఎంఐ-17 హెలికాఫ్టర్స్ను వినియోగించారు.
దేశానికి చెదపురుగులా అవినీతి
అవినీతి, కుటుంబ రాజకీయాలకు వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమించాలని ప్రధాని పిలుపునిచ్చారు. అవినీతి దేశాభివృద్ధికి చెదపురుగులా పట్టిందని ఆందోళన వ్యక్తం చేశారు. దాన్ని రూపుమాపే దిశగా అందరూ కృషిచేయాలన్నారు. దేశ ప్రగతికి నారీశక్తే పునాది అని, మహిళలను గౌరవిస్తేనే అభివృద్ధి సాధ్యమని అన్నారు. మహిళల ఆత్మగౌరవాన్ని తగ్గించడం ద్వారా కొత్తగా ఒరిగేదేమీ ఉండదన్నారు. దేశంలో త్వరలోనే 5జీ సేవలు అందుబాటులోకి రానున్నట్టు తెలిపారు. పెట్రోల్లో 10 శాతం ఇథనాల్ను కలిపే లక్ష్యాన్ని అనుకున్న సమయం కంటే ముందే చేరుకున్నామని పేర్కొన్నారు. ఏటా స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కొత్త పథకాలను ప్రకటించే మోదీ.. ఈసారి అలాంటి ప్రకటనలు ఏమీ చేయలేదు. ఉగ్రదాడులు జరుగనున్నాయన్న నిఘా సంస్థల హెచ్చరికల నేపథ్యంలో ఎర్రకోట పరిసరాల్లో పలు అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. విధుల్లో 10 వేల మంది పోలీసులు భాగమయ్యారు.
ప్రపంచ దేశాల్లో మువ్వన్నెల సంబురం
75వ స్వాతంత్య్ర దినోత్సవ సంబురాలను ప్రపంచ దేశాల్లో ఉన్న భారతీయులు ఎంతో ఘనంగా ర్వహించుకున్నారు. జాతీయ పతాకాన్ని ఎగురవేసి, జాతీయ గీతాన్ని, దేశభక్తి గీతాలను ఆలపిస్తూ స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు. చైనా, నేపాల్, ఇజ్రాయెల్, సింగపూర్ తదితర దేశాల్లోని భారత రాయబార కార్యాలయాల్లో అక్కడి ఉన్నతాధికారులు జెండాను ఎగురవేశారు. ప్రవాస భారతీయులు మిఠాయిలు పంచుకొని పరస్పరం శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. అమెరికా అధ్యక్షుడు బైడెన్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్ మెక్రాన్, ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ ఆల్బనీస్, రష్యా అధ్యక్షుడు పుతిన్ తదితరులు భారత ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.