న్యూఢిల్లీ: దేశంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు విదేశీ వాణిజ్యాన్ని, ఎగుమతులను (Exports) తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ఈ ఏడాది ఆశించినమేర వానలు (Rainfall) కురవకపోవడంతో ఆహార ధాన్యాల ఉత్పత్తి తగ్గనుంది. దీంతో ఇప్పటికే బాస్మతీయేతర తెల్ల బియ్యం, ఉల్లిగడ్డ ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించిన విషయం తెలిసిందే. తాజాగా చక్కెర ఎగుమతులను (Sugar exports) కూడా నిలిపివేయాలని (Ban) నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తున్నది. దేశంలో చెరుకు పంటను అధికంగా పండించే రాష్ట్రాలైన కర్ణాటక (Karnataka), మహారాష్ట్రల్లో (Maharashtra) తగినంతగా వర్షాలు కురవలేదు. దీంతో చెరుకు పంట దిగుబడి తగ్గే అవకాశం ఉంది. దీంతో దేశంలో చక్కెర ఉత్పత్తి కూడా పడిపోనుంది. రానున్న సీజన్లో ధరలను కట్టడి చేడయానికి వచ్చే సీజన్లో చక్కెర ఎగుమతులపై ఆంక్షలు విధించాలని ప్రభుత్వం యోచిస్తున్నది. ఇదే జరిగితే చక్కెర ఎగుమతులపై కేంద్ర నిషేధం విధించడం గత ఏడేండ్లలో ఇదే మొదటిసారి అవుతుంది.
దేశీయ అవసరాలను (sugar requirements) తీర్చడంపై తాము ప్రస్తుతం దృష్టి సారించామని పేరుచెప్పడానికి ఇష్టపడని ఓ కేంద్ర ప్రభుత్వ అధికారి తెలిపారు. మిగులు చెరకు నుంచి ఇథనాల్ (Ethanol) ఉత్పత్తికి ప్రాధాన్యమిస్తున్నామని చెప్పారు. రానున్న సీజన్లో ఎగుమతులకు సరిపడా చక్కెర తమ లేదని వెల్లడించారు. సెప్టెంబర్ 30తో ముగియనున్న ప్రస్తుత సీజన్లో 6.1 మిలియన్ టన్నుల షుగర్ ఎగుతులకే ప్రభుత్వ అనుమతించింది. గతేడాది ఇదే సమయంలో దేశం 11.1 మిలియన్ టన్నుల చక్కెరను విదేశాలకు ఎగుమతి చేసింది. రాబోయే 2023-24 సీజన్లో దేశంలో చక్కెర ఉత్పత్తి 3.3 శాతం అంటే 31.7 మిలియన్ టన్నులకు తగ్గే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్టోబర్తో మొదలయ్యే సీజన్లో (October season) చక్కెర ఎగుమతులను ప్రభుత్వం నిషేధించనుంది. ఇది ప్రపంచ దేశాలపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఇప్పటికే న్యూయార్క్ (New York), లండన్లలో (London) రికార్డు స్థాయికి చక్కెర ధరలు చేరాయి. ఈ నేపథ్యంలో ప్రపంచంలో మరోసారి ఆహార ద్రవ్యోల్బణం తలెత్తనుందనే ఆందోళనలు నెలకొన్నాయి.
కాగా, ఆహార ద్రవ్యోల్బణంపై భారత్ ఇప్పటికే ఆందోళన చెందుతున్నది. జూలై నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం (Retail inflation) 7.4 శాతానికి చేరుకుంది. గత 15 నెలల ఇదే గరిష్టం. ఇక ఆహార ద్రవ్యోల్బణం (Food inflation) 11.5 శాతానికి చేరుకుంది. ఇది మూడేండ్లలో అత్యధికం.