Terrorist Pannu | అమెరికాలో ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నును హతమార్చేందుకు కుట్ర పన్నారనే ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు భారత్ ఉన్నతస్థాయి విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్య వ్యవహారంలో ఇప్పటికే భారత్, కెనడా దేశాల మధ్య ఇంకా ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే, అమెరికాలో పన్నుని చంపేందుకు విఫల ప్రయత్నం జరిగిందని బ్రిటిష్ దినపత్రిక అమెరికన్ అధికారులను ఉటంకిస్తూ కథనాన్ని ప్రచురించింది.
ఇందులో భారత ప్రమేయం ఉందని ఆరోపించింది. ఈ వ్యవహారంపై ఇప్పటికే భారత్ స్పందించింది. తాజాగా ఈ వ్యవహారంపై విచారణ కమిటీని వేశారు. కమిటీ నివేదిక ఆధారంగా ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి తెలిపారు. భారత్-అమెరికా భద్రతా సహకారంపై చర్చ సందర్భంగా వ్యవస్థీకృత నేరస్థులు, గన్ రన్నర్స్, ఉగ్రవాదులు తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా భారత్ తనవంతుగా అమెరికా పక్షం నుంచి సమాచారాన్ని సేకరించింది, దాన్ని తీవ్రంగా పరిగణిస్తుందన్నారు.
ఎందుకంటే మన జాతీయ ప్రయోజనాలను ప్రభావితం చేస్తుందన్నారు. ఖలిస్తానీ ఉగ్రవాది పన్నూను హతమార్చేందుకు పన్నిన కుట్రను అమెరికా భగ్నం చేసిందని బ్రిటిషన్ దినపత్రిక కథనంలో పేర్కొంది. ఈ కుట్రలో భారతదేశం ప్రమేయం ఉందని అమెరికా ఆరోపించడంతో పాటు భారత్కు హెచ్చరికలు జారీ చేసింది. అయితే, హత్య ఘటన ఎప్పుడు జరిగిందో మాత్రం పేర్కొనలేదు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడిపై న్యూయార్క్ జిల్లా కోర్టులో సీల్డ్ కేసు దాఖలు చేయగా.. ఆ కవరు తెరిచిన తర్వాతే నిందితుడు ఎవరో తేలనుంది.