న్యూఢిల్లీ, జూలై 1: మొఘలుల కాలం నాటి అరుదైన రెండు బంగారు నాణేల జాడ పట్టుకునేందుకు కేంద్ర ప్రభుత్వం వేట ప్రారంభించింది. వాటిలో ఒక నాణెం బరువు 12 కేజీలు ఉంటుంది. మానవ చరిత్రలో ఇప్పటివరకు రూపొందించిన అతిపెద్ద నాణెంగా దీన్ని చెబుతున్నారు. ఈ నాణెం దాదాపు 4 దశాబ్దాల నుంచి కనిపించట్లేదు. మొఘల్ చక్రవర్తి జహంగీర్ కాలంలో ఈ నాణెం ముద్రితమైంది. మరో నాణెం కేజీ బరువు ఉంటుంది. దీన్ని షాజహాన్ కాలంలో ముద్రించారు. అయితే 12 కేజీల నాణెం నిజాం నవాబుల చేతుల్లోకి వెళ్లిందని, చివరిసారిగా ఎనిమిదో నిజాం ముఖరంజా దగ్గర కనిపించిందని చరిత్రకారులు చెబుతున్నారు. ముఖరంజాకు ఆయన తాత, ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ నుంచి సంక్రమించిందని పేర్కొంటున్నారు. ఈ నాణెంతో పాటు మరో నాణేన్ని 1987లో జెనీవాలో జరిగిన స్విస్ బ్యాంకు వేలం పాటలో ముఖరంజా అమ్మారని కేంద్రానికి సమాచారం అందింది. వేలంలో ఈ నాణేన్ని రూ.127 కోట్లకు అమ్మారు. ఆ తర్వాత ఈ విషయంలో కేసు నమోదైంది. కొన్నేండ్ల తర్వాత విచారణ ఆగిపోగా, ఇటీవల తిరిగి ఆ నాణెం కోసం కేంద్రం వెతుకులాట ప్రారంభించింది.