న్యూఢిల్లీ : భారత్తో (Indo-Pak Talks) చర్చలకు పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సంసిద్ధత వ్యక్తం చేయడంపై ప్రభుత్వం గురువారం స్పందించింది. పాకిస్తాన్ సహా అన్ని దేశాలతో సాధారణ సంబంధాలకు ఉగ్రవాద రహిత వాతావరణం నెలకొనాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. సంప్రదింపులపై పాక్ ప్రధాని చేసిన వ్యాఖ్యలు తమ దృష్టికి వచ్చాయని, పాకిస్తాన్ సహా పొరుగు దేశాలన్నింటితో సాధారణ సంబంధాలను తాము కోరుకుంటున్నామని, అయితే ఇందుకు సహృద్భావ వాతావరణం తప్పనిసరని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందం బాగ్చి అన్నారు.
భారత్తో చర్చలకు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఇటీవల సంసిద్ధత వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. చర్చల పట్ల పొరుగు దేశం చిత్తశుద్ధితో ముందుకొస్తే తాము సంప్రదింపులకు సానుకూలంగా ఉన్నామని, యుద్ధమనేది ఎలాంటి ప్రత్యామ్నాయం కాదని ఆయన వ్యాఖ్యానించారు. తమది అణ్వస్త్ర దేశమని, అయితే తాము దుందుడుకుగా ముందుకెళ్లమని, రక్షణ కోసమే అణ్వాయుధాలను సమీకరించుకున్నామని చెప్పుకొచ్చారు.
గత 75 ఏండ్లలో తాము మూడు యుద్ధాల్లో పోరాడామని గుర్తుచేశారు. యుద్ధాలతో మరింత పేదరికం, నిరుద్యోగం పెచ్చుమీరడంతో పాటు విద్య, వైద్యం వంటి కీలక రంగాలకు వనరులు కొరవడ్డాయని ఆందోళన వ్యక్తం చేశారు.
Read More :