న్యూఢిల్లీ : భారత్, కెనడా మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్న క్రమంలో ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యోదంతంలో ఎలాంటి ఆధారాలను కెనడా సమర్పించలేదని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA)గురువారం పేర్కొంది. నిజ్జర్ను కెనడా భూభాగంలో భారత్ హత్య చేసిందని కెనడా ప్రధాని ట్రూడో వ్యాఖ్యల అనంతరం ఇరు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
తమకు ఎలాంటి నిర్ధిష్ట సమాచారం అందించినా పరిశీలించేందుకు సిద్ధమని చెప్పామని, ఇప్పటివరకూ కెనడా నుంచి నిర్ధిష్ట సమాచారం, ఆధారాలు అందలేదని విదేశీ వ్యవహరాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందం బాగ్చి పేర్కొన్నారు. కెనడా భూభాగం నుంచి వ్యక్తుల నేర కార్యకలాపాలకు సంబంధించి తమవైపు నుంచి నిర్ధిష్ట సమాచారాన్ని కెనడాతో పంచుకున్నామని చెప్పారు.
ఈ సమాచారం ఆధారంగా కెనడా ఇప్పటివరకూ చర్యలు చేపట్టలేదని తెలిపారు. రాజకీయ కోణంలోనే కెనడా ఈ ఆరోపణలు చేసిందని బాగ్చి వ్యాఖ్యానించారు. హర్దీప్ నిజ్జర్ హత్య విషయంలో భారత్ ఏజెంట్ల పాత్ర ఉందని కెనడా ప్రధాని ఆరోపణల అనంతరం భారత్-కెనడాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఇరు దేశాలు దౌత్యవేత్తలను పరస్పరం బహిష్కరించగా, కెనడాలో వీసా సర్వీసులను భారత్ నిలిపివేసింది.
Read More :
India-Canada Row | ఖలిస్తానీ గ్రూపులతో ఐఎస్ఐ ఏజెంట్ల రహస్య భేటీ..!