India Corona | దేశంలో (India) కరోనా వైరస్ (Corona Virus) వ్యాప్తి మరోసారి ఆందోళన కలిగిస్తోంది. రోజు రోజుకూ కొత్త కేసుల్లో భారీ పెరుగుదల కనిపిస్తోంది. గత నాలుగు రోజులుగా మూడు వేల కేసులు నమోదవ్వగా.. తాజాగా 24 గంటల వ్యవధిలో ఏకంగా నాలుగు వేలకు పైనే కొత్త కేసులు వెలుగు చూశాయి. కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ (Health Ministry Of India) వెల్లడించిన వివరాల ప్రకారం.. మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు 1,31,086 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. 4,435 కొత్త కేసులు బయటపడ్డాయి. నిన్నటితో పోలిస్తే ఈరోజు కొత్త కేసుల్లో 46 శాతం మేర పెరుగుదల కనిపించింది.
కాగా, 163 రోజుల తర్వాత ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. గతేడాది సెప్టెంబర్ 25న 4,777 కేసులు వెలుగు చూశాయి. తాజా కేసులతో దేశంలో కొవిడ్ (Covid-19) బారిన పడిన వారి సంఖ్య 44,733,719కి చేరింది. ప్రస్తుతం 23,091 కేసులు యాక్టివ్ (Active Cases)గా ఉన్నాయి. ఇక గత 24 గంటల వ్యవధిలో కరోనా కారణంగా కేరళ, మహారాష్ట్రలో నలుగురు చొప్పున, ఢిల్లీ, చత్తీస్గఢ్, గుజరాత్, హరియాణా, కర్ణాటక, పుదుచ్ఛేరి, రాజస్థాన్లో ఒక్కొక్కరు చొప్పున మొత్తం 15 మంది మృతి చెందారు. దీంతో కొవిడ్ మరణాల సంఖ్య 5,30,916కి పెరిగింది.
ఇక దేశంలో ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల్లో 0.05 శాతం మాత్రమే యాక్టివ్గా ఉన్నాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ (Health Ministry Of India) అధికారులు వెల్లడించారు. రికవరీ రేటు 98.76 శాతం, మరణాల రేటు 1.19 శాతంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఇప్పటి వరకు 220.66 (220,66,16,373) కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు వెల్లడించారు.
Also Read..
Rupert Murdoch | నిశ్చితార్థం రద్దు చేసుకున్న వృద్ధ ప్రేమికులు.. కారణం ఏంటంటే..?
Poorna | హ్యాపీ మూమెంట్లో పూర్ణ.. పండంటి మగబిడ్డకు వెల్కమ్
Credit Card | కస్టమర్ క్రెడిట్ కార్డు బ్లాక్.. యాక్సిస్ బ్యాంకుకు 10వేల జరిమానా