Credit Card | సిటీబ్యూరో (నమస్తే తెలంగాణ): ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా వినియోగదారుడి క్రెడిట్ కార్డును బ్లాక్ చేసిన ఘటనలో యాక్సిస్ బ్యాంక్కు హైదరాబాద్ వినియోగదారుల కమిషన్-1 రూ.10వేలు జరిమానా విధించింది.
వివరాల్లోకి వెళితే.. అత్తాపూర్కు చెందిన సయ్యద్ ముక్తాదిరుల్ ట్రావెల్ ఏజెన్సీ బిజినెస్ నడుపుతున్నాడు. యాక్సిస్ బ్యాంక్ నుంచి 2021లో క్రెడిట్ కార్డును పొందాడు. అయితే కార్డును అనుమతించకముందే డబ్బులు వినియోగించాడని ఎలాంటి సమాచారం లేకుండానే కార్డును బ్లాక్ చేశారు. దీంతో బాధితుడు క్రెడిట్ ఖాతాలో తన అదనపు డబ్బులు ఉన్నాయని, వాటిని రీఫండ్ చేయాలని బ్యాంక్ అధికారులకు విన్నవించాడు. బ్యాంక్ అధికారులు స్పందించకపోవడంతో బాధితుడు వినియోగదారుల కమిషన్ను ఆశ్రయించాడు. దీంతో కేసును కమిషన్ అధ్యక్షురాలు బి.ఉమావెంకట సుబ్బలక్ష్మి, సభ్యులు సి.లక్ష్మీప్రసన్న, ఆర్.నారాయణరెడ్డిలతో కూడిన బెంచ్ పరిశీలించింది. తన అదనపు డబ్బులు రూ.38,151 చెల్లించాలని పేర్కొన్నది. దీంతోపాటు వినియోగదారుడిని మానసికంగా ఇబ్బందులకు గురిచేసినందుకు రూ.10వేలు చెల్లించాలని పేర్కొన్నది.