న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 1,52,734 కేసులు నమోదయ్యాయి. గత 50 రోజుల్లో రోజువారీ కేసులు ఇంత తక్కువగా నమోదవడం ఇదే మొదటిసారి. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 2,80,47,534కు చేరాయి. ఇందులో 2,56,92,342 మంది బాధితులు కరోనా నుంచి కోలుకోగా, 20,26,092 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. మరో 3,29,100 మంది మహమ్మారి వల్ల మరణించారు. కాగా, నిన్న ఉదయం నుంచి ఇప్పటివరకు కొత్తగా 2,38,022 మంది వైరస్ నుంచి బయటపడగా, కొత్తగా 3128 మంది మృతిచెందారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఈ నెల 4 తర్వాత అతి తక్కువ మరణాల సంఖ్య ఇదేనని పేర్కొంది. రికవరీ రేటు 91.60 శాతానికి పెరగగా, పాజిటివిటీ రేటు 9.04 శాతానికి తగ్గిందని తెలిపింది.
దేశ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతున్నది. ఇప్పటివరకు 21,31,54,129 మందికి కరోనా టీకా పంపిణీ చేశామని తెలిపింది. కాగా, మే 30 నాటికి 34,48,66,883 నమూనాలకు కరోనా పరీక్షలు చేశామని భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎమ్మార్) ప్రకటించింది. ఇందులో నిన్న ఒక్కరోజే 16,83,135 మందికి పరీక్షలు నిర్వహించామని వెల్లడించింది.