న్యూఢిల్లీ : దేశంలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతున్నది. గత కొద్ది రోజులుగా వరుసగా రోజువారీ కేసులు తగ్గుతూ వస్తున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కేవలం 795 కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ మంగళవారం తెలిపింది. కొత్తగా 1,280 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. వైరస్ కారణంగా 58 మంది మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసులు 12,054కు పడిపోయాయి. కొత్త కేసులతో కలిపి దేశంలో మొత్తం కేసుల సంఖ్య 4,30,29,839కు చేరింది.
ఇందులో 4,24,96,369 మంది కోలుకున్నారు. మహమ్మారితో 5,21,416 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దేశంలో కొవిడ్ రికవరీ రేటు 98.67శాతం ఉందని, రోజువారీ పాజిటిటీ రేటు 0.17శాతానికి పడిపోయిందని ఆరోగ్యశాఖ తెలిపింది. ఇప్పటి వరకు 79.15కోట్ల కొవిడ్ టెస్టులు చేశామని, గత 24 గంటల్లో 4.66లక్షల పరీక్షలు చేసినట్లు పేర్కొంది. టీకా డ్రైవ్లో భాగంగా ఇప్పటి వరకు 1,84,87,33,081 డోసులు పంపిణీ చేసినట్లు వివరించింది.