న్యూఢిల్లీ: దేశంలో రోజువారీ కరోనా కేసులు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. శుక్రవారం 2451 కేసులు నమోదవగా, కొత్తగా 2527 మంది కరోనా బారినపడ్డారు. దీంతో మొత్తం కేసులు 4,30,54,952కు చేరాయి. ఇందులో 15,079 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. ఇప్పటివరకు 4,25,17,124 మంది డిశ్చార్జీ అయ్యారు. మరో 5,22,149 మంది కరోనాకు బలయ్యారు. కాగా, గత 24 గంటల్లో 1656 మంది కరోనా నుంచి కోలుకోగా, 33 మంది మృతిచెందారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
కరోనా కేసులు పెరుగుతుండటంతో రోజువారీ పాజిటివిటీ రేటు కూడా అధికమవుతున్నది. పాటివిటీ రేటు ప్రస్తుతం 0.56 శాతంగా ఉందని, యాక్టివ్ కేసులు 0.03 శాతం, రికవరీరేటు 98.75 శాతం, మరణాలు 1.21 శాతంగా ఉన్నాయని వెల్లడించింది. ఇక దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 1,87,46,72,536 వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని తెలిపింది. ఇందులో నిన్న ఒక్కరోజే 19,13,296 మందికి వ్యాక్సినేషన్ చేశామని వెల్లడించింది.