న్యూఢిల్లీ: దేశంపై కరోనా వైరస్ దండయాత్ర కొనసాగుతున్నది. మహమ్మారి విజృంభణతో రోజువారీ కేసులు రెండు లక్షలు దాటాయి. బుధవారంతో పోల్చితే 27 శాతం అధికంగా నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. యాక్టివ్ కేసులు కూడా పదకొండు లక్షలకు చేరాయని తెలిపింది. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు భారీగా పెరుగుతున్నాయి.
దేశవ్యాప్తంగా కొత్తగా 2,47,417 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 3,63,17,927కి చేరాయి. ఇందులో 3,47,15,361 మంది కోలుకోగా, 4,85,035 మంది మరణించారు. మరో 11,17,531 కేసులు యాక్టివ్గా ఉన్నాయి.
రోజువారీ పాజిటివిటీ రేటు 13.11 శాతానికి, వీక్లీ పాజిటివిటీ రేటు 10.80 శాతానికి పెరిగిందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. గత 24 గంటల్లో 380 మంది మరణించగా, 84,825 మంది కోలుకున్నారని తెలిపింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 154.61 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేశామని పేర్కొన్నది.
ఒమిక్రాన్ కేసుల సంఖ్య 5488కి పెరిగింది. ఇందులో 2162 మంది బాధితులు కోలుకున్నారు. ఒమిక్రాన్ కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్రలో 1367 నమోదవగా, రాజస్థాన్లో 792, ఢిల్లీ 549, కేరళ 486, కర్ణాటక 479, పశ్చిమబెంగాల్ 294 కేసుల చొప్పున ఉన్నాయి.