న్యూఢిల్లీ: దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ విజృంభిస్తుండటంతో కరోనా కేసులు (Corona cases) కూడా భారీగా నమోదవుతున్నాయి. శుక్రవారం 16 వేలకుపైగా కేసులు రికార్డవగా, కొత్తగా 22,775 మంది కరోనా బారిన పడ్డారు. దీంతో మొత్తం కేసులు 3,48,61,579కి చేరాయి. ఇందులో 3,42,75,312 మంది బాధితులు కరోనా నుంచి బయటపడ్డారు. మరో 1,04,781 కేసులు యాక్టివ్గా ఉండగా, 4,81,486 మంది మృతిచెందారు. కాగా, గత 24 గంటల్లో కొత్తగా 8949 మంది కోలుకోగా, 406 మంది మరణించారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం కరోనా రికవరీ రేటు 98.32 శాతంగా ఉందని తెలిపింది.
ఇక ఒమిక్రాన్ కేసులు 1431కి చేరాయి. ఇందులో అత్యధికంగా మహారాష్ట్రలోనే ఉన్నాయి. రాష్ట్రంలో 454 కేసులు నమోదయ్యాయి. ఢిల్లీలో 351 కేసులు, తమిళనాడులో 118, గుజరాత్లో 115, కేరళలో 109, రాజస్థాన్ 69, తెలంగాణ 62 చొప్పున ఉన్నాయి. మొత్తంగా 23 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ కొత్త వేరియంట్ కేసులు నమోదవుతున్నాయి. కాగా, ఒమిక్రాన్ బాధితుల్లో 488 మంది డిశ్చార్జీ అయ్యారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.