న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు మరోసారి భారీగా పెరిగాయి. రెండు రోజులపాటు తగ్గిన పాజిటివ్ కేసులు మళ్లీ 17 వేలు దాటాయి. ఆదివారం 11 వేల మందికి పాజిటివ్ రాగా, కొత్తగా మరో 17,073 మంది కరోనా బారిన పడ్డారు. ఇవి నిన్నటికంటే 45 శాతం అధికం కావడం విశేషం. దీంతో మొత్తం కేసులు 4,34,07,046కు చేరుకున్నాయి. ఇందులో 4,27,87,606 మంది బాధితులు డిశ్చార్జీ అయ్యారు. మరో 94,420 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. ఇప్పటివరకు 5,25,020 మంది కరోనాకు బలయ్యారు.
కాగా, ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం 8 గంటల వరకు కొత్తగా 21 మంది బాధితులు మృతిచెందారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. 15,208 మంది బాధితులు వైరస్ నుంచి బయటపడ్డారని తెలిపింది. ఇక 2,49,646 మందికి వ్యాక్సినేషన్ చేశామని ప్రకటించింది. దీంతో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా కరోనా టీకాల పంపిణీ 197.11 కోట్లకు చేరిందని పేర్కొన్నది.
ఇక మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల సంఖ్య 0.21 శాతానికి పెరిగిందని, రికవరీ రేటు 98.57 శాతం, మరణాల రేటు 1.21 శాతం, రోజువారీ పాజిటివిటీ రేటు 4.39 శాతానికి పెరిగిందని వెల్లడించింది.