న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ కరాళనృత్యం చేస్తున్నది. మహమ్మారి విజృంభణతో కేవలం ఎనిమిది రోజుల వ్యవధిలోనే రోజువారీ కేసులు లక్ష దాటాయి. దీంతో 2021, జూన్ 6 తర్వాత అంటే గత ఏడు నెలల్లో ఇంత భారీ సంఖ్యలో పాజిటివ్ కేసులు రికార్డవడం ఇదే మొదటిసారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. రోజువారీ కేసులతోపాటు యాక్టివ్ కేసులు కూడా ఆందోళనకరమైన రీతిలో పెరుగుతూ వస్తున్నాయి.
దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 1,17,100 కరోనా కేసులు కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 3,52,26,386కు పెరిగాయి. ఇందులో 3,43,71,845 మంది కోలుకోగా, 4,83,178 మంది బాధితులు మృతిచెందారు. మరో 3,71,363 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. దీంతో దేశంలో కరోనా పాజిటివిటీ రేటు 7.74 శాతానికి చేరింది. కాగా, గురువారం ఉదయం నుంచి ఇప్పటివరకు కొత్తగా 302 మంది మహమ్మారికి బలవగా, 30,836 మంది కోలుకున్నారు.
మహారాష్ట్ర మరోసారి కరోనా కేంద్ర బిందువుగా మారింది. రాష్ట్రంలో గురువారం అత్యధికంగా 36,265 కేసులు నమోదయ్యాయి. దీంతో మరఠ్వాడలో మొత్తం కేసులు 67,93,297కు చేరాయి. పశ్చిమ బెంగాల్లో 15,421 కేసులు, ఢిల్లీలో 15,097, తమిళనాడులో 6,983, కర్ణాటకలో 5031, కేరళలో 4649, గుజరాత్లో 4213, ఉత్తరప్రదేశ్లో 3114 మంది కరోనా బారినపడ్డారు.
కాగా, కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు 3007కు చేరాయి. ఇందులో 1199 మంది బాధితులు కోలుకున్నారని, మరో 1808 కేసులు యాక్టివ్గా ఉన్నాయని ఆరోగ్యశాఖ వెల్లడించింది. అత్యధికంగా మహారాష్ట్రలో 876, ఢిల్లీలో 465, కర్ణాటకలో 333, రాజస్థాన్ 291, కేరళ 284, గుజరాత్ 204 చొప్పున ఉన్నాయి.