Indus Waters Treaty : సింధు నదీ జలాల ఒప్పందం రద్దు విషయంలో మధ్యవర్తిత్వానికి ఇండియా నో చెప్పింది. ఈ అంశంలో కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ జోక్యాన్ని ఇండియా తప్పుబట్టింది. ఇది చట్ట వ్యతిరేకం అని స్పష్టం చేసింది. పహల్గాంలో ఉగ్రవాదుల దాడికి నిరసనగా భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. పాక్లోని ఉగ్రస్థావరాలపై దాడులు చేసింది. ఇదే సమయంలో పాకిస్తాన్తో ఉన్న సింధు నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లు భారత్ ప్రకటించింది.
దీంతో ఇండియా నుంచి పాకిస్తాన్ సింధు నదీ ప్రవాహం నిలిచిపోయింది. సింధు నదీ జలాలు రాకపోవడంతో పాకిస్తాన్ దిక్కుతోచని స్థితిలో ఉంది. ఈ నది నీళ్లు విడుదల చేయాలని ఇండియాపై బెదిరింపులకు దిగుతోంది. అలాగే, అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని చెబుతోంది. తాజాగా, సింధు నదీ జలాల ఒప్పందం రద్దు అంశంపై ప్రపంచ బ్యాంకుకు చెందిన కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ (సీఓఏ) జోక్యం చేసుకుంది. తాజాగా సింధు నది అంశంపై ఇండియాకు కీలక సూచనలు చేసింది. ఇండియా నిర్ణయాన్ని తప్పుబట్టింది.
‘‘పాకిస్తాన్తో సింధు నదీ జలాలా ఒప్పందాన్ని ఇండియా పూర్తిస్థాయిలో అమలు చేయాలి. గత ఒప్పందానికి కట్టుబడి ఉండాలి. ఈ ఒప్పందాన్ని తాత్కాలికంగా రద్దు చేసుకోవడానికి ఇండియా చెబుతున్న కారణాలు న్యాయబద్ధంగా లేవు’’ అంటూ సీఓఏ పేర్కొంది. ఇండియా తన ఒప్పందాన్ని కొనసాగించాలని సూచించింది. దీనిపై భారత విదేశీ వ్యవహారాల శాఖ స్పందించింది. అసలు ఈ విషయంలో జోక్యం చేసుకునే హక్కు సీఓఏకు లేదని తేల్చి చెప్పింది. సీఓఏకు ఎలాంటి చట్టబద్ధతా లేదని పేర్కొంది.
‘‘సీఓఏను ఇండియా ఎప్పుడూ న్యాయబద్ధమైన సంస్థగా గుర్తించలేదు. ఈ సంస్థ ఆదేశాల్ని, సూచనల్ని ఇండియా అంగీకరించబోదు. గతంలో కూడా ఎప్పుడూ సీఓఏ ముందు హాజరుకాలేదు. దేని కోసం ఈ సంస్థను ఆశ్రయించలేదు. భారత సార్వభౌమ అధికారాల్లో జోక్యం చేసుకునే అధికారం సీఓఏకు లేదు. ఇప్పుడు లేదా భవిష్యత్తులో ఈ సంస్థ ఇచ్చే ఆదేశాలు, తీర్పులను ఇండియా పరిగణనలోకి తీసుకోదు. అవి భారత చర్యలు, ప్రాజెక్టుల్ని ఆపలేవు’’ అని ఇండియా స్పష్టంగా పేర్కొంది.