న్యూఢిల్లీ/న్యూయార్క్: గాజాలో కాల్పుల విరమణ (Gaza ceasefire) తీర్మానంపై ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో శుక్రవారం జరిగిన ఓటింగ్కు భారత్ దూరంగా ఉన్నది. ఇజ్రాయెల్, హమాస్ వివాదంలో తక్షణ మానవతావాద సంధికి పిలుపునిస్తూ ప్రతిపాదించిన ముసాయిదా తీర్మానంపై ఓటు వేసేందుకు భారత్ నిరాకరించింది. ఉగ్రవాద సంస్థ హమాస్ గురించి ఎలాంటి ప్రస్తావన లేకపోవడంతో ఈ తీర్మానానికి మద్దతు ఇవ్వలేదని భారత్ వెల్లడించింది.
కాగా, గాజాలో కాల్పుల విరమణ, అవరోధం లేకుండా మానవతా సహాయం కోసం జోర్డాన్ సమర్పించిన ఈ తీర్మానానికి బంగ్లాదేశ్, మాల్దీవులు, పాకిస్థాన్, రష్యా, దక్షిణాఫ్రికాతో సహా 40కు పైగా దేశాలు మద్దతిచ్చాయి. ‘గాజాలో పౌరుల రక్షణ, చట్టపరమైన మానవతా బాధ్యతలను సమర్ధించడం’ అన్న శీర్షికతో రూపొందించిన ఈ తీర్మానానికి అనుకూలంగా 120 దేశాలు ఓటు వేశాయి. 14 దేశాలు వ్యతిరేకించగా 45 దేశాలు గైర్హాజరయ్యాయి. భారత్తో పాటు, ఆస్ట్రేలియా, కెనడా, జర్మనీ, జపాన్, ఉక్రెయిన్, బ్రిటన్ ఓటింగ్కు దూరంగా ఉన్నాయి.
మరోవైపు ఐరాస సాధారణ అసెంబ్లీలో ఈ తీర్మానంపై ఓటింగ్కు ముందు కెనడా ప్రతిపాదించిన టెక్ట్ సవరణకు అమెరికా పట్టుబట్టింది. అయితే తీర్మానం సవరణ కోసం జరిగిన ఓటింగ్లో భారత్ సహా 87 దేశాలు అనుకూలంగా ఓటు వేశాయి. 55 దేశాలు వ్యతిరేకంగా ఓటు వేయగా, 23 గైర్హాజరయ్యాయి. ఈ నేపథ్యంలో ముసాయిదా సవరణను ఆమోదించలేమని ఐరాస సాధారణ అసెంబ్లీ 78వ సెషన్ అధ్యక్షుడు డెన్నిస్ ఫ్రాన్సిస్ ప్రకటించారు.