న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తున్నది. గత కొన్ని రోజులుగా పెరుగుతూ వస్తున్న పాజిటివ్ కేసులు, ఇవాళ రికార్డుస్థాయికి చేరుకున్నాయి. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 46,951 కరోనా కేసులు నమోదయ్యాయి. రోజువారీ కేసుల్లో ఈ ఏడాది ఇదే అత్యధికం కావడం విశేషం. అదేవిధంగా చాలా రోజుల తర్వాత మరణాలు రెండు వందలు దాటాయి. నిన్న ఉదయం నుంచి ఇప్పటివకు 212 మంది మృతిచెందారు.
దీంతో మొత్తం కేసులు 1,16,46,081కు చేరాయి. ఇందులో 1,11,51,468 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. మరో 1,59,967 మంది మహమ్మారి వల్ల మృతిచెందారు. కాగా, 3,34,646 కేసులు యాక్టివ్గా ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. కొత్తగా 21,180 మంది బాధితులు కోలుకున్నారని వెల్లడించింది.
దేశంలో కొత్తగా నమోదైన పాజిటివ్ కేసుల్లో ఒక్క మహారాష్ట్రలోనే 30 వేలు ఉండటం గమనార్హం. కాగా, దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నది. ఇప్పటివరకు 4,50,65,998 మంది కొవిడ్ టీకా తీసుకున్నారు.
కరోనా కేసులు మరోసారి పేరుగుతుండటంతో పరీక్షలను ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. దీంతో నిన్న ఒక్కరోజే 8,80,655 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. మొత్తంగా మార్చి 21 వరకు 23,44,45,774 నమూనాలను పరీక్షించామని భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎమ్మార్) ప్రకటించింది.