న్యూఢిల్లీ: ఇప్పటి వరకు రక్షణ పరంగా విదేశాలపై ఆధారపడిన భారత్, ఇప్పుడు సొంతంగా తయారు చేయడంతోపాటు అమ్మే స్థాయికి కూడా ఎదిగింది. మలేషియాకు 18 ఫైటర్ యుద్ధ విమానాలను అమ్మనున్నది. రక్షణ మంత్రిత్వ శాఖ ఈ మేరకు పార్లమెంట్కు లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చింది. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ దేశీయంగా తయారు చేసిన తేలికపాటి యుద్ధ విమానం (ఎల్సీఏ) తేజస్ కోసం రాయల్ మలేషియా ఎయిర్ ఫోర్స్ నుంచి గత ఏడాది అక్టోబర్లో ప్రతిపాదన వచ్చిందని రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్ భట్ తెలిపారు. 18 జెట్స్ కొనుగోలుకు మలేషియా చేసిన ప్రతిపాదనకు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ ప్రతి స్పందించిందని చెప్పారు. రెండు సీట్ల వేరియంట్ తేజస్ను విక్రయించడానికి సుముఖత వ్యక్తం చేసిందని వెల్లడించారు.
కాగా, ఎల్సీఏ తేజస్ ఎయిర్క్రాఫ్ట్పై ఇతర దేశాలు కూడా ఆసక్తి చూపాయని మంత్రి అజయ్ భట్ తెలిపారు. అర్జెంటీనా, ఆస్ట్రేలియా, ఈజిప్ట్, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్తోపాటు అమెరికా కూడా ఈ జాబితాలో ఉన్నాయని చెప్పారు. అలాగే స్టెల్త్ ఫైటర్ జెట్ తయారీకి కసరత్తు జరుగుతున్నదని అన్నారు. అయితే జాతీయ భద్రతా కారణాలను పేర్కొంటూ టైమ్లైన్ వెల్లడికి నిరాకరించారు.