Ethanol : ఎల్పీజీ సిలిండర్లు లేని భారతీయ ఇండ్లు చాలా అరుదు. ప్రతి ఇంట్లో వంట కోసం ఎల్పీజీ వినియోగిస్తున్న రోజులివి. అయితే, త్వరలో ఎల్పీజీని ఇథనాల్ రీప్లేస్ చేయబోతుంది. ఇప్పటికే వాహనాల్లో ఇథనాల్ కలిసిన పెట్రోల్ అందుబాటులోకిరాగా.. త్వరలో డీజిల్ కూడా వినియోగంలోకి రానుంది. ఇది పూర్తయ్యేలోపు ఎల్పీజీ స్థానంలో ఇథనాల్ను వంటగ్యాస్గా ప్రవేశపెట్టేందుకు కేంద్రం రెడీ అవుతోంది. లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (ఎల్పీజీ)కి ప్రత్యామ్నాయంగా ఇథనాల్ ఆధారిత వంటగ్యాస్ను కేంద్రం తీసుకురానున్నట్లు సమాచారం.
దీనిపై ఇప్పటికే కేంద్ర పెట్రోలియం, చమురు మంత్రిత్వశాఖ కసరత్తులు ప్రారంభించింది. ఇథనాల్ ఉత్పత్తి, ఇథనాల్పై సబ్సిడీ, సరఫరా వంటి అంశాలపై కేంద్రం అధ్యయనం చేస్తోంది. దేశంలో ప్రస్తుతం వినియోగంలో ఉన్న చమురు స్థానంలో ఇథనాల్ను ప్రవేశపెట్టబోతుంది. ఈ అంశంలో చమురు ఉత్పత్తి, సరఫరా సంస్తలతో కూడా కేంద్రం సంప్రదింపులు జరుపుతోంది. ఇక, ఎల్పీజీ స్థానంలో ఇథనాల్పై సెప్టెంబర్లోపు ఒక పాలసీని కేంద్రం రూపొందించనుంది. ఇది అమలులోకి వస్తే ఎల్పీజీ బదులు ఇథనాల్తోనే వంట చేసుకోవచ్చు. ఎల్పీజీ నుంచి వినియోగదారులు ఇథనాల్వైపు మారితే వారికి సబ్సిడీ కూడా ఇవ్వాలని కేంద్రం భావిస్తోంది.
భారీ సరఫరా, పంపిణీ వ్యవస్థను కూడా అందుబాటులోకి తేవాలని కేంద్రం ప్రయత్నిస్తోంది. దేశంలో ఇప్పటికి ఇథనాల్ ఉత్పత్తికి ఎలాంటి ఆటంకం లేదు. మన అవసరాలకంటే ఎక్కువే ఇథనాల్ ఉత్పత్తి చేయగల సామర్ధ్యం మన సంస్థలకు ఉంది. ఇప్పటికే దేశంలో ఇథనాల్ ఉత్పత్తి సామర్ధ్యం ఏడాదికి 20 బిలియన్ లీటర్లకంటే ఎక్కువే ఉంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలోనే మరో 4 బిలియన్ లీటర్ల ఉత్పత్తి సామర్ధ్యం పెరగనుంది. ఈ మొత్తంలో ప్రభుత్వం లక్ష్యమైన ఈ20 పెట్రోల్ కోసం 11 బిలియన్ లీటర్ల ఇథనాల్ వినియోగం అవుతోంది. మిగిలిన దాంట్లో 3-3.5 బిలియన్ లీటర్ల వరకు ఇథనాల్ను ఫార్మా సంస్థలు, లిక్కర్ సంస్తలు, కెమికల్ సంస్థలు వాడుతున్నాయి.
ఇంకా ఏడు బిలియన్ లీటర్ల వరకు ఇథనాల్ మిగిలిపోతోంది. దీంతో ఈ ఇథనాల్ను వంట గ్యాస్గా మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ విషయంలో చమురు సంస్థలు ఇప్పటికే పరీక్షలు జరుగుతున్నాయి. ఇవి పూర్తిస్థాయిలో సఫలమైతే ఇథనాల్ కుకింగ్ గ్యాస్ అందుబాటులోకి వస్తుంది.