Women’s Reservation Bill | న్యూఢిల్లీ, సెప్టెంబర్ 29: మహిళల మూడు దశాబ్దాల కల సాకారమైంది. ఏన్నో ఏండ్లు ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే మహిళా రిజర్వేషన్ల బిల్లుపై శుక్రవారం రాజముద్ర పడింది. ఇటీవల పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదించిన నారీ శక్తి వందన్ అధినియం బిల్లుకు తాజాగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. దీంతో ఈ బిల్లు 106వ రాజ్యాంగ సవరణ చట్టంగా రూపాంతరం చెందింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ‘అధికారిక గెజిట్లో కేంద్రం నిర్ణయించిన తేదీ నుంచి ఈ చట్టం అమల్లోకి వస్తుంది’ అని కేంద్రం తాజా నోటిఫికేషన్లో పేర్కొంది.
ఈ చట్టం ద్వారా లోక్సభ, రాష్ర్టాల అసెంబ్లీల్లో మహిళలకు మూడింట ఒక వంతు సీట్లు దక్కనున్నాయి. మహిళలకు చట్టసభల్లో ప్రాతినిథ్యం పెంచే ఈ రాజ్యాంగ సవరణ చట్టం జనగణన, డీలిమిటేషన్ ప్రక్రియ తర్వాత అమల్లోకి వస్తుంది. 2024 సార్వత్రిక ఎన్నికల అనంతరం జనగణన, డీలిమిటేషన్ ప్రక్రియ మొదలయ్యే అవకాశం ఉంది. మొదట జనగణన చేపట్టి.. జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన చేసే అవకాశం ఉంది. ఈ ప్రక్రియ మొత్తం పూర్తయ్యేందుకు 2029 వరకు సమయం పట్టవచ్చు. పార్లమెంట్లో బిల్లుపై చర్చ సందర్భంగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా మాటలను బట్టి 2029 సార్వత్రిక ఎన్నికల్లోనే ఈ చట్టం అమల్లోకి వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది.
ఇటీవల నిర్వహించిన ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో మహిళా బిల్లుకు పార్లమెంట్ ఆమోద ముద్ర వేసిన విషయం తెలిసిందే. ఈ నెల 20న లోక్సభలో ఈ బిల్లును ప్రవేశపెట్టగా 454 ఎంపీలు దీనికి అనుకూలంగా ఓటు వేయగా.. ఇద్దరు మాత్రమే వ్యతిరేకించారు. 21న రాజ్యసభలో ప్రవేశపెట్టగా.. 214 మంది ఎంపీలు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. ఈ చట్టం ప్రకారం మహిళా రిజర్వేషన్లు 15 ఏండ్ల పాటు కొనసాగనున్నాయి. ఆ తర్వాత అవసరాన్ని బట్టి దీన్ని పొడిగించే వెసులుబాటు పార్లమెంట్కు ఉంది. మహిళా రిజర్వేషన్లలో భాగంగా ఎస్సీ, ఎస్టీ సామాజికవర్గానికి చెందిన మహిళలకు కూడా అందులో ప్రత్యేక కోటా అమలయ్యేలా ఈ చట్టంలో పొందుపరిచారు.