ఇతర దేశంపై దాడులకు తెగబడటం, ఇతర భూభాగాన్ని లాక్కోవడం లాంటి చరిత్ర భారత దేశానికి లేదని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. ఈ మనస్తత్వమే భారత పాలకులకు ఉండి వుంటే, 1971 లో జరిగిన యుద్ధంలోనే వారి భూమిని ఆక్రమించుకునేవారమని, భారత్కు అలాంటి బుద్ధే లేదని స్పష్టం చేశారు. అయితే ఆ దేశం పేరు తాను ఉచ్చరించనని అన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటోందని, అభివృద్ధి వైపు బాటలు వేస్తోందని పేర్కొన్నారు. ఫిక్కీ ఏర్పాటు చేసిన సమావేశంలో రాజ్నాథ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో సైన్స్, టెక్నాలజీలో అద్భుతమైన నైపుణ్యం ఉన్న వారు దేశంలో ఉన్నారని, ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాలకు చెందిన కంపెనీలకు భారతీయులే సీఈవోలుగా ఉంటున్నారని పేర్కొన్నారు. ఆరోగ్య, విద్య రంగాల్లో ప్రైవేట్, పబ్లిక్ పెట్టుబడులు పెరగాలని తాము బలంగా కోరుకుంటున్నామని, ఆ వైపుగా అడుగులు కూడా పడుతున్నాయని తెలిపారు. ఈ రెండు రంగాల్లో పెట్టుబడులను బాగా ఆకర్షించి, ప్రపంచంలోనే భారత్ను మెరుగైన స్థానంలో ఉంచడానికి ప్రయత్నిస్తున్నామని రాజ్నాథ్ అన్నారు.