PM Modi : ఇంతకాలం శ్రామికశక్తిగా పేరుగాంచిన భారతదేశం (INDIA) ప్రస్తుతం ప్రపంచశక్తిగా మారుతోందని ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) అన్నారు. భారత్ ఇటీవల మహాకుంభమేళా నిర్వహించి తన నిర్వహణ నైపుణ్యాన్ని చాటుకుందని తెలిపారు. భారత్ రోజుకో రికార్డును సృష్టిస్తోందని, భారతదేశ నిర్వహణ నైపుణ్యాన్ని, ఆవిష్కరణల సామర్థ్యాన్ని ప్రపంచం మొత్తం ఆసక్తిగా గమనిస్తోందని చెప్పారు.
శనివారం ఢిల్లీలో నిర్వహించిన ఎన్ఎక్స్టీ కాంక్లేవ్ 2025 (NXT Conclave 2025) లో ప్రధాని మాట్లాడుతూ.. భారత్ గురించి ప్రతిరోజూ సానుకూల సమాచారం వస్తుండటంతో ప్రపంచ దేశాలు ఆసక్తిగా గమనిస్తున్నాయని, భారత్కు రావాలని తహతహలాడుతున్నాయని అన్నారు. ఫిబ్రవరి 26న ప్రయాగ్రాజ్లో ముగిసిన మహాకుంభ్-2025 గురించి మోదీ ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ.. ఒక టెంపరరీ సిటీలో నదీతీరాల వెంబడి కోట్లాది మంది ప్రజలు పవిత్రస్నానాలు చేయడం.. యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిందని చెప్పారు.
భారతదేశం గ్లోబల్ శక్తిగా ఎదుగుతున్న వైనాన్ని మోదీ వివరిస్తూ.. ఏఐ సదస్సులో భారతదేశం కో-హోస్ట్గా వ్యవహరించిందని, భవిష్యత్తులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో భారత్ కీలక భూమిక పోషించనుందని చెప్పారు. తదుపరి ఏఐ సమ్మిట్కు భారత్ ఆతిథ్యం ఇవ్వనుందన్నారు. ఏఐ, గ్లోబల్ ఎకనామిక్ సమ్మిట్ల ద్వారా టెక్నాలజీ, ఇన్నోవేషన్, గ్లోబల్ డిప్లొమసీలో ఎదుగుతున్న శక్తిగా భారత్ కీలకపాత్ర పోషించనుందని స్పష్టంచేశారు.
భారతదేశం సెమికండక్టర్లు, విమాన వాహక నౌకల తయారీ లాంటి వాటితో వేగంగా అభివృద్ధి చెందుతోందని, ఆటోమొబైల్ ఉత్పత్తిదారుగా కూడా మరిందని ప్రధాని చెప్పారు. భారతదేశం పాటించే యోగా, ధ్యానం లాంటివి విదేశీయులు ఆచరిస్తున్నారని, మన సూపర్ఫుడ్ మఖానా, మిల్లెట్, ఆయుష్ ఉత్పత్తులు విరివిగా వాడుతున్నారని తెలిపారు.