నేషనల్ డెస్క్ ;మరో ఏడాది ముగిసింది. క్యాలెండర్ మారింది. కానీ ప్రధాని ఇచ్చిన హామీలు హామీలుగానే మిగిలిపోయాయి. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏండ్లు పూర్తయ్యే 2022నాటికి అన్నదాతల ఆదాయం రెట్టింపు చేస్తామని, అందరికీ ఇల్లు, 24 గంటల విద్యుత్తు అందిస్తామని, బుల్లెట్ రైలును అందుబాటులోకి తెస్తామని వివిధ సందర్భాల్లో ప్రధాని ఆర్భాటంగా ప్రకటించారు. అయితే ఇందులో ఏ ఒక్క హామీ సాకారం కాలేదు.
ఆదాయం కాదు.. ఆత్మహత్యలు రెట్టింపు
2022 నాటికి దేశంలో అన్నదాతల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని 2016 ఫిబ్రవరిలో ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. ఆదా యం రెట్టింపు సంగతి అటుంచితే.. దేశంలో రైతుల ఆత్మహత్యలు రెట్టింపు అయ్యాయి. పైగా అన్నదాతల వెన్ను విరిచేలా వివాదాస్పద వ్యవసాయ చట్టాలను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ కలుపు చట్టాలకు వ్యతిరేకంగా, దేశం ఎన్నడూ ఎరుగని రీతిలో, అన్నదాతలు ఢిల్లీ సరిహద్దుల్లో భారీ ఉద్యమం చేపట్టారు. రైతుల ఆగ్రహానికి జడిసి కేంద్రం ఆ చట్టాలను రద్దు చేసింది. స్వయంగా ప్రధాని మోదీ క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. ఇంధన ధరలను కేంద్రం భారీగా పెంచడం, ముడిసరుకు ధరలు కూడా భారీగా పెరుగడంతో రైతుల పెట్టుబడి ఖర్చు డబుల్ అయింది. ఆదాయం క్షీణించింది.
పట్టాలెక్కని బుల్లెట్ ట్రైన్
దేశంలో 2022నాటికి బుల్లెట్ రైలును అందుబాటులోకి తీసుకొస్తామని 2018 ఫిబ్రవరిలో ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. జపాన్ సహకారంతో ముంబై-అహ్మదాబాద్ మధ్య బుల్లెట్ రైలు పరుగులు తీస్తుందని ఆర్భాటంగా ప్రకటించారు. నాలుగేండ్లు గడిచినా ఇంకా హామీ నెరవేరలేదు. కనీసం భూ సేకరణ ప్రక్రియ కూడా పూర్తి కాలేదు. బుల్లెట్ రైలు అందుబాటులోకి రావడానికి ఇంకా ఐదేండ్లు పట్టొచ్చని నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ రాజేంద్ర ప్రసాద్ గత వారం వెల్లడించారు. ట్రయల్ రన్ను 2026లో నిర్వహిస్తామని చెప్పారు.
పతనం దిశగా ఆర్థికం
2022నాటికల్లా దేశాన్ని 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతామని ప్రధాని మోదీ 2018 సెప్టెంబర్లో ప్రకటించారు. అయితే కేంద్ర ప్రభుత్వ విధానాలతో దేశ ఆర్థికం దారుణంగా దెబ్బతింది. ద్రవ్యోల్బణం భారీగా పెరిగింది. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ ఎన్నడూ లేనివిధంగా క్షీణించింది. కేంద్ర ప్రభుత్వ అప్పులు దాదాపు 150 లక్షల కోట్లకు చేరాయి.
అందరికీ ఇల్లు.. అందని ద్రాక్షే
2022నాటికి దేశంలో ప్రతి ఒక్కరికీ సొంతింటి కల సాకారం అవుతుందని 2018 జూలైలో ప్రధాని ప్రకటించారు. పీఎం ఆవాస్ యోజన కింద ఇండ్ల నిర్మాణం నత్తనడకన సాగుతున్నది. ఈ పథకం కింద 1.2 కోట్ల ఇండ్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకోగా.. సగం మేరకే లక్ష్యాన్ని చేరుకున్నది. దీంతో వచ్చే ఏడాది డిసెంబర్కు కేంద్రం గడువు పొడిగించింది.
24 గంటల విద్యుత్తు.. పగటి కలే
2022 నాటికి ప్రతి ఇంటికీ నిరంతర విద్యుత్తు అందిస్తామని, చీకట్లను పారదోలుతామని 2015లోనే ప్రధాని మోదీ ప్రకటించారు. ఏడేండ్లు పూర్తయ్యాయి. ఇచ్చిన హామీ హామీగానే మిగిలిపోయింది. దేశంలో ఇంకా చాలా ఇండ్లకు కనీసం విద్యుత్తు కనెక్షన్ కూడా లేదు. గత ఏడాది తెలంగాణ మినహా దేశవ్యాప్తంగా ఎంతటి విద్యుత్తు సంక్షోభం నెలకొన్నదో అందరికీ తెలిసిందే. విద్యుత్తు కోతలతో చాలా రాష్ర్టాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
గగన్యాన్కు బ్రేకులు
గగన్యాన్ మిషన్ ద్వారా 2022నాటికి భారతీయులను రోదసిలోకి పంపిస్తామని 2018లో స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధాని మోదీ ఘనంగా ప్రకటించారు. అయితే నాలుగేండ్లు పూర్తయినా అది సాకారం కాలేదు. గగన్యాన్ మిషన్కు బ్రేకులు పడుతూనే ఉన్నాయి. వచ్చే ఏడాది మావనసహిత యాత్ర చేపట్టనున్నట్టు కేంద్రం తాజాగా పేర్కొన్నది.